– నల్లగొండ 22వ డివిజన్ కార్పొరేటర్ పర్వీన్ సమద్
నీలగిరి, ఏప్రిల్ 01 : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్లగొండ 22వ డివిజన్ కార్పోరేటర్ పర్వీన్ సమద్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 22వ డివిజన్లోని రెహమత్ నగర్ అంగన్వాడీ పాఠశాలలో మిషన్ వాత్సల్య పథకంలో బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాల నివారణ, బాలలపై లైంగిక వేధింపులు, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దన్నారు. బాలలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. అధికారులు అనాథ బాలలను గుర్తించి వాళ్లని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం నూతన కార్పోరేటర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జయమ్మ, అంగన్వాడీ టీచర్లు జ్యోతి, కవిత, యుసిటిసి సిబ్బంది మహేశ్, ఏఎన్ఎం నళిని, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.