చివ్వెంల, మే 13 : ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానం పొందేలా బోధన చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం చివ్వెంల మండల పరిధి ఉండ్రుగొండ శివారులో గల స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ నందు క్వాలిటీ ఎడ్యుకేషన్ పై ఉపాధ్యాయులకు జరుగుతున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడు నిబద్ధతతో పనిచేసి ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థానం చేరుకునేలా చూడాలన్నారు.
సమాజంలోని అసమానతలు తొలగాలంటే విద్య ముఖ్య పాత్ర పోషిస్తుందని, అట్టి విద్యను అందించే ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక బోధనపై ఉపాధ్యాయులకు మార్గ నిర్దేశం చేశారు. విద్యా సంవత్సరానికి గాను ప్రత్యేక ప్రణాళికలు రచించి ఆగస్టు 15లోగా ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు వచ్చేలా చూడాలని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమానికి మండల రిసోర్స్ పర్సన్స్, ఆంగ్లము, గణితము, సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పాఠశాలల సహోపాధ్యాయులు, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, కో ఆర్డినేటర్లు జనార్దన్, పూలమ్మ, స్వామి నారాయణ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఆర్ పి రాంబాబు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Chivemula : ప్రతి విద్యార్థి ఉన్నత స్థానం పొందేలా బోధించాలి : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
Chivemula : ప్రతి విద్యార్థి ఉన్నత స్థానం పొందేలా బోధించాలి : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్