నల్లగొండ, ఫిబ్రవరి 17: యాసంగి సీజన్లో వేసిన పైరు పొట్ట దశకు వస్తున్నా అన్నదాతకు మాత్రం ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అందడం లేదు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రైతు బంధు వేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు రెండు నెలలైనా పట్టించుకో కపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10.56 లక్షల మంది రైతులకు ఈ సీజన్కు సంబంధించి రూ.1,450 కోట్లు పెట్టుబడి సాయం అందాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.493 కోట్లు మాత్రమే వారి ఖాతాల్లోకి చేరింది. నల్లగొండ జిల్లాలో 5,42,106 మంది రైతులకు గానూ 3,75,656 మందికి రూ.251.50 కోట్లు ఇచ్చింది. సూర్యాపేట జిల్లాలో 2,93,689 మంది రైతులు ఉండగా 2,12,204 మందికి రూ.130.08 కోట్లు, యాదాద్రిలో 2,21,113 మందికి గానూ 1,81,163 మందికి రూ.112.10 కోట్లు ఖాతాల్లో జమ చేసింది. ఇంకా రూ.956 కోట్లు పెండింగ్లో ఉన్నాయి.
ఈ సాయం కోసం 2,87,885 మంది రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటివరకూ మూడెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు అందింది. సీజన్ అదును దాటుతుండడంతో వడ్డీ వ్యాపారులు, బ్యాంకర్లను ఆశ్రయించి అప్పు తీసుకుని సాగు పనులు మొదలు పెట్టిన రైతులు ఇప్పటికీ సర్కారు సాయం అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండున్నర నెలలైనా 34శాతమే..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఇప్పటివరకు రైతుబంధు 34 శాతమే ఇచ్చింది. రైతుకు పెట్టుబడి సాయం అందచేసి వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చాలనే ఆలోచనతో కేసీఆర్ సర్కారు ప్రారంభించిన రైతు బంధు లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నది. డిసెంబర్ 9నే ఎకరాకు రూ.15వేల చొప్పున ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ మాట మార్చి అదే పదివేల చొప్పున.. ఒక సీజన్కు రూ.5 వేల మాత్రమే ఇస్తూ, అదీ జాప్యం చేయడంపై రైతులు మండిపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినా ఇప్పటి వరకూ దీనిపై అతీగతీ లేదు. ప్రభుత్వం కనీస ప్రకటన కూడా లేకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటివరకు రూ.251 కోట్లు జమ
యాసంగి సీజన్కు సంబంధించిన రైతు బంధును ప్రభుత్వం గత డిసెంబర్ 10 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. నల్లగొండ జిల్లాలో 5,42,106 మంది రైతులకు రైతుబంధు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 3,75,656 మంది రైతులకు రూ.251.50 కోట్లు అందాయి. మిగిలిన రైతులకు కూడా వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
-శ్రవణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, నల్లగొండ
కేసీఆర్ సర్కారు అయితే జనవరిలోనే వేసేది
యాసంగి పంట మొదలు పెట్టి రెండు నెలలు అయితున్నా ఇప్పటికీ ప్రభుత్వం రైతు బంధు పైసల్ ఖాతాలో పడలేదు. నాకు నాలుగెరాల భూమి ఉంది. వరి సాగు చేస్తున్నా. పెట్టబడికి ఇబ్బంది అయితుంది. కేసీఆర్ ప్రభుత్వం యాసంగికి జనవరి మొదటి వారంలోనే పెట్టుబడి సాయం ఇచ్చేది. ఈ ప్రభుత్వంలో ఇప్పటికీ గతి లేదు.
-నారగోని యాదయ్య, రైతు, చిన్నసూరారం,నల్లగొండ మండలం