యాదాద్రి, జనవరి 2 : స్వయంభూ నారసింహుడి నిత్యోత్సవాలు వైభవంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. స్వయంభూ నారసింహుడికి ప్రాతఃకాల తిరువారాధన, ధనుర్మాసోత్సవంలో భాగంగా తిరుప్పావై సేవకాలం, బాలభోగం, ఆరగింపు, చాత్మరై జరిపారు.
ప్రధానాలయంలో పలు దఫాలుగా జరిగిన సువర్ణ పుష్పార్చనలో భక్తులు పాల్గొన్నారు. అనుబంధ రామలింగేశ్వర స్వామి ప్రధానాలయంలో పరమశివుడు, స్పటిక లింగేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. వరుస సెలవులతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. సుమారు 20 వేల మంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.41,18,136 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ భానుప్రకాశ్రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి సతీసమేతంగా, ఆర్డీఓ భూపాల్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి స్వామివారి ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన..
ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదాద్రి దివ్యక్షేత్రంలో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. మేడ్చల్ జిల్లాలోని రాంపల్లికి చెందిన శ్రీ సాంస్కృతిక విశ్వకళా మండలి ఆధ్వర్యంలో శిష్య బృందం 20 మంది చేపట్టిన ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.