నల్లగొండ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. కలెక్టరేట్లో సోమవారం ఎస్పీ అపూర్వరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ ప్రవర్తించకూడదని అన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు సహకరించాలని కోరారు. జిల్లాలో 1,766 పోలింగ్ కేంద్రాల్లో 14.26 లక్షల మంది ఓటర్లుగా ఉన్నారని, వీరంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిక్కచ్చిగా అమలు చేసేందుకు సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.
1950 నెంబర్, కంట్రోల్ రూమ్, సీ-విజిల్కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇతర సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1950ను సంప్రదించాలని సూచించారు. ఇక నుంచి రాజకీయ పార్టీలు నామినేషన్ వేయకముందు సభలు నిర్వహిస్తే ఆ ఖర్చులు పార్టీల ఖర్చు కిందకు వస్తాయన్నారు. అభ్యర్థి నామినేషన్ వేస్తే ఆరోజు నుంచి సదరు అభ్యర్థి ఖర్చుల కిందకు వస్తాయని తెలిపారు. ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ ఓటర్లకు డబ్బు, మద్యం, ఇతర గిఫ్టుల పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ఫ్లయింగ్ స్కాడ్లతో పాటు చెక్పోస్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటాయని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసు శాఖ పని చేస్తుందని వివరించారు.