పుస్తకం అమ్మలా లాలిస్తుంది. నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది. ఒంటరితనంలో స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది. బాధపడే వారిని ఓదారుస్తుంది. అలసిన మనసులను సేద తీరుస్తుంది. అందుకే పుస్తకం అనితరమైన ఆయుధంగా, నేస్తంగా అన్ని తరాల వారిని అలరిస్తున్నది. ‘మంచి పుస్తకం ఓ మంచి ప్రాణస్నేహితుడి’తో సమానం. వజ్రాల కన్నా పుస్తకాల విలువే ఎక్కవని బాపూజీ సంబోధించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వగలిగిన అమూల్యమైన ఆస్తి మంచి పుస్తకాలే.
పిల్లల చదువు పెద్దలు బాధ్యతగా స్వీకరించాలి
సాహిత్య అకాడమీలు, సాక్షరభారత్, సర్వశిక్ష అభియాన్ వంటివి కూడా పిల్లలకు, విద్యార్థులకు అవసరమైన అనేక పుస్తకాలు ప్రచురించాయి. పుస్తకరూపం మారవచ్చు కానీ పుస్తకానికి ఆదరణ మాత్రం తగ్గలేదు. తరతరాలుగా జ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తున్నది. పుస్తకం ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ప్రస్తుతం చిన్నారులు పుస్తకాలను పట్టుకుని చదవడం మరిచి సామాజిక మాధ్యమాలకు అంకితమవుతున్నారు. ఇంటర్నెట్లో చదివే పిల్లల్లో సహజ ఎదుగుదల మందగిస్తుంది. పుస్తక పఠనాన్ని తల్లిదండ్రులు, పెద్దలు బాధ్యతగా స్వీకరించి పిల్లలతో చిన్నప్పటి నుంచే చదివించడం నేర్పించాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో మౌలిక భాషా, గణిత సామర్థ్యాలను పెంచేలా ఈ విద్యా సంవత్సరం తొలిమెట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా దానిలో అంతర్భాగం ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో భాషా విషయాలతోపాటు భాషాయేతర విషయాల్లో ప్రగతి సాధించేలా ఎస్సీఈఆర్టీ రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలో 152 పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసింది. మార్చి 23, 24 తేదీల్లో జిల్లా స్థాయిలో ప్రధానోపాధ్యాయులకు గ్రంథాలయ నిర్వహణ, పఠనా వ్యూహాలు, మార్గదర్శకాలు అనే అంశంపై శిక్షణ ఇచ్చింది.
చదువుతో మెదడుకు పదును
పుస్తక పఠనానికి కొంత సమయం కేటాయించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కథల పుస్తకాలు పిల్లలో ఏకాగ్రత, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. చూడటం కన్నా చదువడం వల్ల మంచి రసానుభూతిని పొందుతారు. పెద్దలు నిత్యం కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయిస్తూ పిల్లలకు అలవాటుగా మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది. మహానుభావుల విజయగాథలు, ఆత్మకథలు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించి ఉన్నత శిఖరాలు చేరవచ్చు.
బాల్యంలోనే జ్ఞాన పునాదులు పడాలి
జ్ఞాన సముపార్జనలో కీలకమైన పఠనానికి పునాదులు పడాల్సింది బాల్యంలోనే. పాఠశాల విద్యాభ్యాసంలో పఠనం అనేది ప్రవేశ ద్వారం లాంటిది. అలాంటి పఠనా సామర్థ్యమే లేకుంటే విద్యాభ్యాసానికి ద్వారాలు మూసుకుపోయినట్లే. పదేళ్ల వయస్సు వచ్చే సరికి చదవడం రానివారు పాఠశాల విద్యానంతరం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా స్వల్ప, మధ్య ఆదాయ దేశాల్లోని దాదాపు పది సంవత్సరాల్లోపు పిల్లల్లో 53 శాతానికి పైగా సరిగ్గా చదువడమే రావడం లేదు. ఇందుకు వారు బాల్యంలో నేర్చుకునే భాషలో, బోధనలో దోషమున్నట్లు అర్థమవుతుంది. ఇలాంటి ప్రాథమిక నైపుణ్యాలు లేని కారణంగా పాఠశాల విద్యానంతరం ఉద్యోగ జీవితంలో ఉత్తమ ఫలితాలు కనబర్చడంలో అవరోధాలు ఏర్పడుతాయనేది నిపుణుల అభిప్రాయం. పుస్తకాలు చదువడంతో సమాజంపై అవగాహన పెరుగుతుంది. మొదట పిల్లలకు చిన్న చిన్న కథలు వినిపిస్తుండాలి. చిత్రాలతో కూడిన ఆసక్తికర పుస్తకాలు చదివించాలి. దాంతో వారు తెలియకుండానే పుస్తకాల పట్ల ఆకర్షితులవుతారు. చిన్నారుల ఇష్టానికి తగినట్లుగా పుస్తకాలు ఎంపిక చేసి చదివేలా ప్రోత్సహించాలి.
పదేళ్ల వయస్సే పఠనానికి కీలకం
సాధారణంగా పదేళ్ల వయస్సు వచ్చే సరికి విద్యార్థులు నాలుగో తరగతికి చేరుకుంటారు. ఈ సమయంలో వారు పదాలను సొంతంగా చదువడం, విశ్లేషించడం ప్రారంభిస్తారు. ఇలా వేగంగా చదువడం అలవాటు పడిన తరువాత పదాల అర్థాల కోసం వెతుకుతారు. తద్వారా పూర్తిగా వాక్యాలను అర్థం చేసుకుంటూ చదువగలిగే నైపుణ్యాన్ని పదకోశంపై పట్టుతోపాటు పఠనా శక్తిని అలవర్చుకుంటారు. పదేళ్ల వయస్సుకు పఠనా పరిజ్ఞానాన్ని సాధించలేకపోతే భవిష్యత్లో చదువులు కష్టమవుతాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది.
– టి.నర్సింహమూర్తి, ఉపాధ్యాయుడు, ప్రాథమికోన్నత పాఠశాల, పాలెం
కథల పుస్తకాలంటే ఎంతో ఇష్టం
మా పాఠశాల లైబ్రరీలో నీతిని బోధించే కథల పుస్తకాలు ఉన్నాయి. నాకు వాటిని చదువడం అంటే ఎంతో ఇష్టం. నేను రోజూ లైబ్రరీకి వెళ్లి కథల పుస్తకాలు చదువుతాను. అర్థం కాని విషయాలను మా టీచర్లను అడిగి తెలుసుకుంటాను. నేర్చుకున్న విషయాలను మా ఫ్రెండ్స్కు చెబుతా. రోజురోజుకూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. గ్రంథాలయంలోని పుస్తకాలను చదివితే టీచర్లు చెప్పే పాఠాలు కూడా బాగా అర్థమవుతున్నాయి.
– బి.హర్షిత, 5వ తరగతి, పాలెం