సూర్యాపేటటౌన్, జూన్ 21 : తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన త్యాగధనుడు, మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం జయశంకర్ వర్ధంతిని సూర్యాపేట క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. జయశంకర్ సార్ సేవలను స్మరించుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో జయశంకర్ పాత్ర మరువలేనిదన్నారు. 1952లో జయశంకర్ సార్ నాన్ ముల్కీ ఉద్యమం, సాంబార్, ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమం, 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. ఎవరూ కూడా మాట్లాడడానికి సాహసించని కాలంలోనే 1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్ సార్ అని కొనియాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు సార్ కల అన్నారు. ఆ కలను సీఎం కేసీఆర్ నిజం చేసి చూపించారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.