హుజూర్నగర్, ఏప్రిల్ 14 : విద్యుత్ శాఖ ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హుజూర్నగర్లో విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా హుజూర్ నగర్ డివిజన్ కార్యాలయం ముందు ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఆర్టిజన్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, విద్యార్హతలను బట్టి కన్వర్షన్ ప్రక్రియను చేపట్టాలన్నారు. 2016 డిసెంబర్ 4 కంటే ముందున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ సంస్థలో విలీనం చేయాలన్నారు. పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనాలు (జీవో 11) అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆర్టిజన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతోనే విధిలేక సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20 వేల మంది ఆర్టిజన్ ఉద్యోగుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కో-చైర్మన్ ఎం.వి.ఎన్ చార్యులు, డివిజన్ చైర్మన్ పిడతల శ్రీనివాసరావు, నాయకులు బత్తిన రామయ్య, బొమ్మపాల వేణు, డి.శంకర్, ఎన్.తిరుపతి రావు పాల్గొన్నారు.