– వారి పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్ధతు
– నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
నల్లగొండ, ఏప్రిల్ 02 : నల్లగొండ విద్యుత్ సంస్థ సర్కిల్ కార్యాలయం ముందు ఆ సంస్థకు చెందిన ఆర్టిజన్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గురువారం వంటావార్పు, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వారికి సంఘీభావంగా నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవట్లేదన్నారు. విద్యుత్ సంస్థకు చెందిన ఆర్టిజన్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామన్న వారి హామీ ఇప్పటికి నెరవేర్చలేదన్నారు. ఆర్టిజన్ల న్యాయమైన కోర్కెలు తీరే వరకు వారికి బాసటగా ఉంటామని తెలిపారు. ఐకమత్యంతో కోర్కెల సాధనకు ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీగా తమ సహాయ సహకారాలు, మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ విద్యుత్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.