నల్లగొండ సిటీ, నవంబర్ 26 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఉదయాదీత్య భవన్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించనున్న నల్లగొండ, చండూరు డివిజన్లకు సంబంధించిన ఆర్ఓలు, (స్టేజ్- వన్) ఏఆర్ఓలు, ఎంపీడీఓలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మొదటి విడత 14 మండలాల్లోని 117 క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను అధికారులందరూ సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నామినేషన్ల స్వీకరణ సందర్భంగా పాటించాల్సిన అన్ని నియమాలను తూ.చా తప్పకుండా పాటించాలన్నారు
సమయపాలన పాటించాలని, నామినేషన్ల కేంద్రం వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తగినన్ని నామినేషన్ ఫారాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎన్నికల నియమ, నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎంపీడీఓలు ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీపీఓ వెంకయ్య, నల్లగొండ, చండూరు ఆర్డీఓలు వై.అశోక్ రెడ్డి, శ్రీదేవి హాజరయ్యారు.