సూర్యాపేట, ఏప్రిల్ 10 : లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిచందన అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్లో బుధవారం ఏఆర్ఓలు, సెక్టార్ అధికారులు, ఎన్నికల బృందాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో జిల్లాలోని తుంగతుర్తి నియోజవర్గంలోని 6 మండలాలు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకమన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. జిల్లాలో 729 ప్రాంతాల్లో 1,021 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 163 ప్రాంతాల్లో 238 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని, అక్కడ గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. అర్హులైన అందరికీ ఎపిక్ కార్డులు జారీ చేయాలన్నారు. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో వెబ్ కాస్టింగ్ చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల అవుతుందని, నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. జిల్లాలో కొత్తగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఉంటే తెలుపాలని చెప్పారు.
సూర్యాపేట జిల్లాలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వెంకట్రావ్ తెలిపారు. నాలుగు నియోజక వర్గాల పరిధిలో 1,201 పోలింగ్ కేంద్రాలు, 9,98,333 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. అంగవైకల్యం ఉన్న ఓటర్లు 17,212 మంది, 85 సంవత్సరాలు పైబడిన వారు 6,424మంది ఉన్నారని, వారికి హోం ఓటింగ్ చేపట్టేందుకు టీమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 48 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఎన్నికల నిర్వహణ కోసం పీఓ, ఏపీఓ, ఈవీఎల మొదటి ర్యాండమైజేషన్ చేపట్టామని అన్నారు.
ఎన్నికల నిర్వహణ కోసం 112 రూట్స్ ఏర్పాటు చేసి 123 మంది సెక్టార్ అధికారులను, 6,296 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. ఎన్నికల కోడ్ పక్కాగా అమలవుతుందని, చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే, నల్లగొండ ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర పోలీస్లతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రియాంక, బీఎస్ లత, శ్రీనివాస్, ట్రైనీ ఐపీఎస్ రాజేశ్మీనా, అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు, జడ్పీ సీఈఓ అప్పారావు, డీఆర్డీఓ మధుసూదనరాజు, డీఎఫ్ఓ సతీశ్కుమార్, డీసీఓ పద్మ పాల్గొన్నారు.