యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పా ర్టీ మరింత దూకుడుగా దూసుకెళ్తున్నది. ఇప్పటికే ప్రచారంలో జాతీయ పార్టీలకు అందనంత దూరంలో ఉన్న గులాబీ పార్టీ మరింత జోరు పెంచనుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. భువనగిరి పార్లమెంట్కు సంబంధించి రూట్మ్యాప్ సిద్ధం చేసింది. రోజుకు మూడు మండలాలను కవర్ చేసేలా షెడ్యూల్ ఖరారు చేసింది. శుక్రవారం నుంచి వచ్చే నెల 6వరకు భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది.
ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. నాలుగో విడుత ఎన్నికల్లో భాగంగా గురువారం భువనగిరి పార్లమెంట్కు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో జనగాం, ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లోని అన్ని మండలాలను కవర్ చేయననున్నారు. ఒక రోజు మూడు మండలాల్లో ప్రచారం చేపట్టనున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు కార్యక్రమాలు ఉండేలా ప్లాన్ చేశారు. ఆయా ప్రచార కార్యక్రమాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. 19న అర్వపల్లి, శాలిగౌరారాం, నకిరేకల్, 20న భూదాన్ పోచంపల్లి, ఆత్మకూరు (ఎం), వలిగొండ, 21న బొమ్మలరామారం, గుండాల, మోత్కూరులో ప్రచారం చేపట్టనున్నారు.
22న భువనగిరిలో క్యామ మల్లేశ్ నామినేషన్ దాఖలు చేస్తారు. 23న మద్దూరు, దూల్మిట్ట, జనగామ పట్టణం, 24న నాంపల్లి, మునుగోడు, చిట్యాల, 25న నూతనకల్, తుంగతుర్తి, నార్కట్పల్లి, 26న నారాయణపురం, గట్టుప్పల్, అబ్దుల్లాపూర్మెట్, 27న తుర్కపల్లి, బచ్చన్నపేట, ఆలేరు టౌన్, 28న రాజాపేట, మోటకొండూరు, అడ్డగూడూరు, 29న కట్టంగూర్, బీబీనగర్, యాదగిరిగుట్ట, 30న మద్దిరాల, తుర్కయంజాల్, మే 2న రామన్నపేట, చౌటుప్పల్, 3న మంచాల, ఇబ్రహీంపట్నం, 4న తిరుమలగిరి, నర్మెట్ట, తరిగొప్పుల, 5న కొమురవెల్లి, చేర్యాల, భువనగిరి పట్టణం, 6న యాచారం, మర్రిగూడ, చండూరు మండలాల్లో ర్యాలీలు, రోడ్షోలు నిర్వహించనున్నారు.
కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందంజలో ఉంది. అందరి కంటే ముందే నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహించింది. దీనికి మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు అభ్యర్థి క్యామ మల్లేశ్ హాజరయ్యారు. సమావేశాలకు సుమారు 3వేల నుంచి 4వేల మంది వరకు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసాలను కేడర్కు వివరించే ప్రయత్నం చేశారు. సన్నాహక సమావేశాలతో గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. ఒక్కసారిగా గ్రామాల్లో సీన్ మారడంతో నూతనోత్తేజం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని శపథం చేస్తున్నారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం, వ్యూహాలకు సంబంధించి సమగ్ర చర్చ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్.. బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్కు బీ ఫామ్ అందించారు. లోక్సభ ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళి అనుసరించి అభ్యర్థికి రూ.95లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, గోట్ అడ్ షీప్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.