నల్లగొండ :. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబందించి రికార్డులు అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పాటిల్, ఈజీఎస్ స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ మురళి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి దేవరకొండ మండలం కొండభీమనపల్లి, తాటికోల్ గ్రామాలలో ఉపాధి హామీ కింద చేపట్టి పూర్తి చేసిన పనులను పరిశీలించారు. లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు.
ఆగస్ట్ 28, 29 తేదీలలో దేవరకొండ, మర్రిగూడ మండలం లలో కేంద్ర అధికారుల బృందం పర్యటించి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా చేపట్టిన పనులు, ఉపాధి హామీ పనులు పరిశీలించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులు పరిశీలించారు. దేవర కొండ మండలం కొండ భీమనపల్లి గ్రామంలో ఈజీఎస్ కింద చేపట్టిన కాటమాని పర్వతాలు కూరగాయల పందిరిని పరిశీలించారు. దొండ పండిస్తున్న రైతులతో మాట్లాడి ఎంత దిగుబడి వస్తుంది, మార్కెటింగ్, ఎంత రేట్ ఉంది. ఆదాయం ఎంత వస్తుంది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తర్వాత తాటికోల్ గ్రామంలో ఈజీఎస్ ద్వారా తాటికోల్ నుంచి అలంపల్లి నర్సింహ పొలం వరకు చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్, మొక్కల పెంపకం నిర్వహణను పరిశీలించారు. అదే గ్రామంలో ఉపాధి హామీ కింద పూడిక తీసిన చెరువును పరిశీలించారు. అనంతరం మర్రిగూడ ఎం.పి.డి.ఓ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
కేంద్ర అధికారుల బృందం సభ్యులు గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి హామీ పనులు పరిశీలించ నున్నందున అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని, పనులు చేపట్టిన రికార్డులు అప్డేట్ చేయాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్, డి.ఆర్.డి.ఓ. కాళిందిని, డి.పి.ఓ.విష్ణు, జడ్.పి సి.ఈ.ఓ. వీరబ్రహ్మ చారి, ఎం.పి.డి.ఓ. యాకుబ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.