హుజూర్నగర్, ఏప్రిల్ 25 : పదేండ్లకు పైగా కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని, అవసరమైతే ఈరోజు నుండి రేపటికి దినసరి వాయిదాలు వేసైనా త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న న్యాయమూర్తులను ఆదేశించిందని, అందువల్ల అట్టి కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన హుజూర్నగర్ సీనియర్ సివిల్ జడ్జి నక్కా శ్యామ సుందర్ న్యాయవాదులను కోరారు. శనివారం ఆయన సీనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయపీఠానికి, న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పుడే కోర్టు కార్యకలాపాలు సజావుగా సాగుతాయని ఆ సహకారాన్ని న్యాయవాదుల నుండి తాను ఆశిస్తున్నానన్నారు.
ప్రతి కోర్టులోనూ 1/3వ వంతు సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారని ముగ్గురు చేయాల్సిన పనిని ఒక్కరే చేయవలసి రావడం మూలంగా వారిపై పని ఒత్తిడి భారీగా పెరిగిందని దీనిని అర్థం చేసుకుని న్యాయవాదులు వారితో ఘర్షణ పడకుండా సామరస్య పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పాత కేసుల విచారణ సమయంలో న్యాయవాదులు వాయిదాలు తీసుకోవడం మాని వేయాలని విచారణకు సిద్ధంగా ఉండి న్యాయ పీఠానికి సహకరించాలన్నారు. కోర్టులో ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకు వచ్చినట్లయితే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 2020వ సంవత్సరం నుండి సివిల్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అంతకు మునుపు ఒక నెలలో రెండు మూడు దావాలు కోర్టులో దాఖలు అయ్యేవని 2020 తర్వాత ఆ సంఖ్య నెలకు 15 నుండి 20 వరకు పెరిగిందని దీనంతటికీ కారణం స్థిరాస్తుల విలువ పెరగడమేనన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి మారుతీ ప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నారపరాజు శ్రీనివాసరావు, ఆర్ వి రమణారెడ్డి, ఉపాధ్యక్షులు జక్కుల వీరయ్య, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, నట్టే సత్యనారాయణ, కుక్కడపు బాలకృష్ణ, అంబటి శ్రీనివాస్ రెడ్డి, నాగేష్ రాథోడ్, కోలా రమాదేవి, సమీనా, జుట్టు కొండ సంధ్య, దీపిక, ధూళిపాల శ్రీనివాసరావు, గొట్టే ప్రశాంత్, బుడిగె నరేష్, చిట్టి పోతుల రమేష్, నాగపాష, సతీష్, ఎంఎస్ రాఘవరావు, మీసాల అంజయ్య, ఏజీపీలు రేణుకాదేవి, సురేష్ నాయక్, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.