శాలిగౌరారం, జనవరి 28 : కొత్త ప్రభుత్వానికి విద్యా రంగమే తొలి ప్రాధాన్యం కావాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యను ప్రజల ఎజెండాలో పొందుపర్చినప్పుడు మాత్రమే సర్కారు విద్య బలోపేతం అవుతుందని, దీని కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన టీఎస్యూటీఎఫ్ జిల్లా విస్తృత సమావేశానికి నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేల్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా రంగంలో అడుగులు పడాలన్నారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ బడుల మీద శ్రద్ధ చూపడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో విద్యా పోరాటాలు కావాలని, దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందరికీ నాణ్యమైన, గుణాత్మక విద్య అందించేలా చొరువ చూపాలని సూచించారు. అవసరం ఉన్నచోట, కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ముందుంటామని ఎమ్మెల్యేలు మందుల సామేల్, వేముల వీరేశం అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేసేది టీఎస్యూటీఎఫ్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఉపాధ్యాయుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తుందని తెలిపారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బుక్ స్టాల్ను ఎమ్మెల్యే వీరేశం తిలకించి సాహితీ పుస్తకాలను కొనుగోలు చేశారు. టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, శాలిగౌరారం జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్కుమార్రెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాములు, రాష్ట్ర కార్యదర్శులు రాజశేఖర్రెడ్డి, నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశం, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు అనిల్కుమార్, యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు, నాయకులు బక్క శ్రీనివాసాచారి, అరుణ, మండల బాధ్యులు పాల్గొన్నారు.