రామగిరి, జనవరి 16 : బడి ఈడు పిల్లలంతా బడిలో ఉండాలనే సంకల్పంతో విద్యాశాఖ నిర్వహించిన బడి బయటి పిల్లల గుర్తింపు సర్వే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా సాగింది. విద్యాశాఖ -సమగ్ర శిక్ష పరిధిలోని సీఆర్పీలు గతేడాది డిసెంబర్ 11నుంచి జనవరి 10 వరకు క్లస్టర్, మండలాల వారీగా సర్వే చేసి జిల్లా అధికారులకు అందజేశారు. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,214 మంది బడి బయటి పిల్లలున్నారనేది స్పష్టమైంది. వీరి సమాచారం అంతా ప్రబంధ్ పోర్టల్లో నమోదు చేశారు. సూర్యాపేట జిల్లాలో వీరి సంఖ్య తక్కువగా ఉన్నది.
‘అందరూ చదువాలి.. అందరూ ఎదుగాలి’ అనే నినాదంతో విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం పాఠశాలల బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తూనే ఏటా చదువుకు దూరంగా ఉంటున్న విద్యార్థులను బడిలో చేర్పించే కార్యక్రమం చేపడుతున్నది. 6 నుంచి 14, 15 నుంచి 19 సంవ్సరాల్లోపు పిల్లలను బడిలో చేర్పించి ఉచిత నిర్బంధ విద్య అందిస్తున్నది. బడిబయట పిల్లలను గుర్తించి సమీప పాఠశాలల్లో చదువు చెప్పిస్తున్నది. 2024-25 సంవత్సరానికి జిల్లాలోని సీఆర్పీలు విద్యాశాఖ సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారి ఆర్.రామచంద్రయ్య పర్యవేక్షణలో బటి బయట పిల్లల గుర్తింపు సర్వే చేపట్టారు. గత నెల డిసెంబర్ 11నుంచి జనవరి 10 వరకు క్లస్టర్ స్థాయిలో జరిపి సర్వే చేసి ఎంఆర్సీలకు అందచేశారు.
వాటిని ప్రబంధ్ పోర్టల్లో సీఆర్పీలు నమోదు చేసి, వాటి పత్రాలను మండల వనరుల కేంద్రాలు, అక్కడి నుంచి డీఈఓ కార్యాలయంలోని సమగ్ర శిక్షకు చేరవేశారు. ఆయా ప్రాంతాల్లో నమోదు చేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించేలా సీఆర్పీలు, జిల్లా విద్యాశాఖాధికారులు నిమగ్నమయ్యారు. మరో వైపు ఇప్పటికే బడిలో నమోదై చాలా కాలం నుంచి బడికి రాకుండా ఉన్న డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. వీటి ఫలితాలను త్వరలో వెల్లడిస్తారని సమాచారం. సర్వేలో విద్యార్థి పేరు, ఆధార్ సంఖ్య, పుట్టిన తేది, వయస్సు, కుటుంబ సభ్యుల జీవనాధారం ఇతర అంశాలను సైతం నమోదు చేసినట్లు తెలుస్తుంది.
2023-24 సంవత్సరంలో చేపట్టిన సర్వేలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,249 మంది బడి బయటి పిల్లలను గుర్తించారు. ఇందులో నల్లగొండ జిల్లాలో 438, సూర్యాపేటలో 179, యాదాద్రి భువనగిరిలో 632 ఉన్నారు. వారిలో ఎక్కువగా 1,007మంది పిల్లలు ఇటుక బట్టీల వద్ద ఉన్నట్లు
గుర్తించారు.
ప్రస్తుతం 2024-25లో చేపట్టిన సర్వేలో ఉమ్మడి జిల్లాలో 1,214 మంది బడి బయటి పిల్లలను గుర్తించారు. ఇందులో ఎక్కువగా ఇటుక బట్టీల వద్ద ఉన్నట్లు నమోదు చేశారు. వీరంతా ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన కూలీలకు చెందిన పిల్లలే. వీరిని సమీపంలోని పాఠశాలల్లో చేర్పించే ప్రయత్నంలో విద్యాశాఖ నిమగ్నమైంది.
బడిబయటి పిల్లల గుర్తింపును రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలతో చేపట్టాం. నల్లగొండ జిల్లాలో 655 మంది పిల్లలు ఉన్నట్లు తేలింది. ఇందులో వివిధ రాష్ర్టాల నుంచి వలస వచ్చిన కార్మికుల పిల్లలే ఎక్కువగాఉన్నారు. ఇక్కడ పనులు ముగియగానే తల్లిదండ్రులతో కలిసి వారి స్వస్థలాలకు వెళ్లే అవకాశం ఉన్నది. ఇప్పటికే చాలా మందిని స్థానికంగా ఉన్న బడుల్లో చేర్పించేలా చర్యలు తీసుకున్నాం.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ