యాదాద్రి, సెప్టెంబర్ 27 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి మంగళవారం సుప్రభాత సేవ కనుల పండువగా జరిగింది. బ్రహ్మీ ముహూర్తంలో స్వామివారి ఆలయాన్ని తెరిచిన అర్చక బృందం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభు ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా సాగింది.
ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శ నారసింహహోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేయింపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ నిత్య తిరుకల్యాణ తంతును జరిపారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టింపజేసి నిత్యకల్యాణ తంతు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణోత్సవాన్ని వీక్షించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ వైభవంగా చేపట్టారు. రాత్రి స్వామివారి తిరువరాధన, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి.
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. విష్ణుపుష్కరిణి చెంతన హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. స్వామివారిని 10,972 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వామివారి ఖజానాకు రూ.22,32,121 ఆదాయం సమకూరిందని ఈఓ గీత తెలిపారు. విమానగోపురం స్వర్ణతాపడానికి హైదరాబాద్కు చెందిన వీరభద్రయ్య-రాధాదేవి దంపతులు రూ. లక్ష విరాళాన్ని అందించారు.
వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగాయి. పర్వతవర్ధిని అమ్మవారికి ఉదయం, మధ్యాహ్నం పూజలు, లలితా అష్టోత్తర శతనామార్చనలు, సప్తశతీపారాయణం నిర్వహించారు. విశ్వకళా మండలి కళాచైతన్య వేదిక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.