చండూరు, నవంబర్ 9 : కాంట్రాక్టుల కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ ఊసరవెల్లి సిగ్గుపడేలా పూటకో పార్టీ మారుస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రూ.570 కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టానని, వాటిని కొనసాగించేందుకు తనకు మరోమారు గెలిపించాలని ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థిగా గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఆందోల్ మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అకడి నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలొచ్చినప్పుడల్లా.. కాంట్రాక్టర్లు వస్తుంటారు, పోతుంటారని… ప్రజలు ఒకసారి ఆలోచించాలని.. ఎవర్ని ఎన్నుకుంటే మనకు సేవ చేస్తారు.. మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటేసి తనను మరోమారు ఆశీర్వదిస్తే ఐదు సంవత్సరాలు మీ సేవకుడిగా ఉంటూ.. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తాను ప్రజల మనిషినని.. తనకు కాంట్రాక్టులు లేవని.. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు కూసుకుంట్ల చెప్పారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే రోజులు పోయాయని, పాలేవో, నీళ్లేవో ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టినట్లు చెప్పారు.
2014లో తాను ఎమ్మెల్యేగా గెలిచాక అనేక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి పురుడు పోసుకున్నామని.. ఫ్లోరోసిస్ రక్కసిని తరిమికొట్టామని, త్వరలో చర్లగూడెం రిజర్వాయర్ను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలంగాణ తల్లి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నానని పేర్కొన్నారు. సాగు నీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని.. అసలు ఎన్నికల్లో పోటే చేయనని చెప్పారు. ఉప ఎన్నిక తరువాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు అధిక నిధులు తీసుకొచ్చినప్పటికీ తక్కువ సమయం ఉండడంతో అన్ని పూర్తి చేయలేక పోయామని.. వాటిని పూర్తి చేయడానికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. రూ.30 కోట్లతో చండూరు మున్సిపాలిటీలో పనులు జరుగుతున్నాయని.. గ్రామాల్లో రూ. 72 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు.
అభివృద్ధి చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని, పనులు ఆపేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. రాజగోపాల్రెడ్డి డబ్బు, మద్యం బలంతో ఎన్నికల్లో గెలువాలని చూస్తున్నాడని, గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉండి కూడా నిధులు తేలేదని.. చౌటుప్పల్లో డంపింగ్ యార్డు తెచ్చి పట్టణాన్ని కంపుగా మార్చాడని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టుల కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడని, రాజగోపాల్రెడ్డిని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఇద్దరు కాంట్రాక్టర్లు ఓట్ల కోసం వస్తున్నారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అనంతరం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన వెంట మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, కల్లు గీత కార్మిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళా వెంకన్న, జడ్పీటీసీలు కర్నాటి వెంకటేశం, పాశం సురేందర్రెడ్డి, వీరమళ్ల భానుమతి, ఎంపీపీలు పల్లె కళ్యాణి, కర్నాటి స్వామి యాదవ్, మొండు మోహన్రెడ్డి, మాజీ జడ్పీటీలు అన్నెపర్తి సంతోష్శేఖర్, పెద్దింటి బుచ్చిరెడ్డి, భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.