రామగిరి, జూలై 18 : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎంసెట్ ఆన్లైన్ ప్రవేశ పరీక్ష సోమవారం నల్లగొండ, సూర్యాపేటలో ప్రశాంతంగా ప్రారంభమైంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయంలో చేరుకున్నారు. జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షకు పరిశీలకులుగా నల్లగొండలో ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఘన్శ్యాం, సూర్యాపేటలో నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొల్లోజు చంద్రశేఖర్ వ్యహరించారు.
విద్యార్థుల హాజరు ఇలా…
నల్లగొండలోని ఎస్పీఆర్ స్కూల్ ఆన్లైన్ పరీక్ష కేంద్రంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 180 మందికి గాను 179 మంది, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరిగిన పరీక్షకు 182 మందికి గాను 177 మంది హాజరైనట్లు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్
వెంకట్రెడ్డి వెల్లడించారు.
సూర్యాపేటలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల ఆన్లైన్ పరీక్ష కేంద్రంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరిగిన పరీక్షకు 220 మందికి గాను 211 మంది, అదే విధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పరీక్షకు 223 మందికి గాను 198 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.