కోదాడ, జూలై 02 : మత్తు పదార్థాల వినియోగంతో యువత ఆరోగ్యం క్షీణించి వారి భవిష్యత్ అంధకారంగా మారుతుందని కోదాడ ఎస్ఐ బి.సుధీర్ అన్నారు. గురువారం కోదాడ కె ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణ అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్యాలను అరికట్టడం సమాజ శ్రేయస్సుకు అత్యవసరమన్నారు. ఇందులో యువత కీలక భూమిక పోషించాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో ఆరోగ్యం క్షీణించడంతో పాటు మానసిక దృఢత్వాన్ని కోల్పోయి నేర ప్రవృత్తికి అలవాటు పడి సంఘ విద్రోహక శక్తులుగా తయారవుతారన్నారు.
మత్తు పదార్థాలు అమ్మినా కొనుగోలు చేసినా స్వీకరించినా నేరస్తులేనని వారికి జైలు శిక్ష తప్పదన్నారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ రమణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు, పోలీస్ డ్రగ్స్ కమిటీ సభ్యులు హుస్సేన్ గౌడ్, అధ్యాపకులు నాగరాజు, పిచ్చిరెడ్డి, యాదగిరి, బల భీమారావు, రమేష్, రత్నకుమారి, వెంకన్న, రామరాజు, నరసింహారెడ్డి, మమత, చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.