భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి రానున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి శీతాకాల విడిది కోసం రాష్ర్టానికి వచ్చిన ఆమె ఉదయం 9.30 గంటలకు యాదాద్రికి చేరుకోనున్నారు. 10 గంటల నుంచి అరగంటపాటు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్రపతి ముర్ము సుమారు గంటా 20 నిమిషాలపాటు యాదాద్రి క్షేత్రంలో ఉండనున్నారు. ఆ మేరకు జిల్లా యంత్రాంగం, వైడీటీఏ, ఆలయ, పోలీస్ ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజగోపురాలు, ఆలయ ప్రాంగణాన్ని పూలమాలలు, మామిడి తోరణాలతో అలంకరించారు. కొండ కింద 3 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 1,200 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. కొండతోపాటు ఆలయ పరిసరాలను అదుపులోకి తీసుకుని, అణువణువూ తనిఖీ శుక్రవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు కొండపైకి భక్తుల వాహనాలకు అనుమతిని ఉండదని స్పష్టంచేశారు. ఇప్పటివరకు నలుగురు రాష్ట్రపతులు యాదాద్రి లక్ష్మీనరసింహుడి సేవలో తరించడం విశేషం.
– యాదాద్రి, డిసెంబర్ 29
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధికి శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఉదయం 9.30 గంటలకు రానున్న రాష్ట్రపతి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు సుమారు గంట ఇరవై నిమిషాలపాటు ఆలయంలో గడపనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం, వైడీటీఏ, పోలీస్ ఉన్నతాధికారులు పూర్తి చేశారు. ఇప్పటి వరకు నలుగురు రాష్ట్రపతులు లక్ష్మినారసింహస్వామిని దర్శించుకోగా.. ద్రౌపది ముర్ము ఐదో రాష్ట్రపతిగా నిలువనున్నారు.
యాదాద్రి హెలిప్యాడ్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక కాన్వాయిలో కొండపైకి చేరుకుంటారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్, న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్, ఆలయ ఈఓ, వైటీడీఏ అధికారులతో పాటు ఆలయ అధికారులు, ప్రధానార్చక బృందం ఆలయ సంప్రదాయ రీతిలో ఆమెకు ఘన స్వాగతం పలుకనున్నారు. కొండపైన ఉత్తర ద్వారం వద్ద ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానర్చకుడు మాధవాచార్యులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలుకనున్నారు. ఉత్తర ద్వారం నుంచి తూర్పు త్రితల రాజగోపురం వద్ద నుంచి ప్రధానాలయంలోని ఆంజనేయస్వామి, గండ భేరుండ నరసింహస్వామిని దర్శించుకుంటారు. ఆంజనేయ స్వామి క్షేత్రం వద్ద అర్చకులు శ్రీనాథాచార్యులు రాష్ట్రపతికి హారతి ఇస్తారు. ప్రధానాలయ ముఖ మండపంలోని ధ్వజ స్తంభాన్ని సందర్శించిన అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. స్వయంభూ నారసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపడతారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించి, రాష్ట్రపతికి ఆశీర్వచనం చేస్తారు. స్వయంభూ దర్శనానంతరం ఆలయ ముఖ మండపంలో రాష్ట్రపతికి చతుర్వేద ఆశీర్వచనం చేయనున్నారు. అనంతరం రాష్ట్రపతి ఆండాళ్ అమ్మవారి సన్నిధి, ఆళ్వార్ సన్నిధిని సందర్శిస్తారు. పశ్చిమ పంచతల రాజగోపురం నుంచి మాఢవీధుల్లోకి ప్రవేశించి, అద్దాల మండపం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణాలను పరిశీలిస్తారు. అనంతరం ఉత్తర రాజగోపురం గుండా తిరుగు ప్రయాణమై కొండకింద హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి పర్యటన సందర్బంగా పటిష్ట భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 1,200 మంది పోలీసులతో భద్రతను చేపట్టనున్నారు. రాచకొండ కమిషనర్ మహేశ్భగవత్, భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి, కాన్వాయ్ ఇన్చార్జి, డీసీపీ పద్మజ, మరో ఆరుగురు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 45 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలు, 200 మంది మహిళా పోలీసులు భద్రతలో పాల్గొననున్నారు. యాదాద్రి కొండతో పాటు ఆలయ పరిసరాలను ఇప్పటికే పోలీసు అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనువణువు క్షుణంగా తనిఖీ చేశారు. హెలిప్యాడ్ వద్ద ఒక అంబులెన్స్, 4 ఫైరింజన్లు, బాంబు డిటెక్టర్లు అందుబాటులో ఉంచారు. పట్టణంలోని ప్రధానరోడ్డు, కొండ చుట్టూ, కొండపైకి వెళ్లేదారిలో పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు కొండపైకి వాహనాలను అనుమతించరు.
యాదాద్రి ఆలయంలో స్వయంభూ నారసింహుడి చెంత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరగంట పాటు గడుపనున్నారు. హైదరాబాద్లోని బొల్లారంలో గల రాష్ట్రపతి భవన్ నుంచి ఉదయం 8.50 గంటలకు బయల్దేరి ఈఎంఈ హెలిప్యాడ్కు చేరకుంటారు. అక్కచి నుంచి ఐఏఎఫ్ ఎంఐ -17 హెలికాప్టర్లో యాదాద్రిలోని హెలిప్యాడ్ వద్దకు రానున్నారు. అక్కడి నుంచి 9.50 గంటలకు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానికి ప్రత్యేక వాహనంలో రానున్నారు. 10 నుంచి 10.30 గంటలకు వరకు స్వయంభూ నరసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపడతారు. 10.30 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకొని, 10.50 గంటలకు హెలికాఫ్టర్లో తిరిగి హైదరాబాద్కు వెళ్తారు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని రూ.1100 కోట్లతో దేశమే గర్వపడే విధంగా పూర్తిగా కృష్ణశిలలలో పునర్నిర్మించారు. ఈ ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ అనంతరం స్వయంభూ ప్రధానాలయం పునఃప్రారంభించారు. ఈ నేపథ్యంలో దేశ, విదేశాల నుంచి వీఐపీ, వీవీఐపీలు ఆలయానికి వచ్చి స్వయంభువును దర్శించుకుంటున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయ నిర్మాణాన్ని చూసేందుకు వస్తున్నారు. గతేడాది జూన్ 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం దేశ ప్రథమపౌరురాలు ద్రౌపది ముర్ము స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి సేవలో పాల్గొననున్నారు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎంతో మంది మహా మహులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని, భక్తి పారవశ్యాన్ని పొందారని విశ్రాంత అర్చకులు వెల్లడించారు. ఈ క్షేత్ర సందర్శనతో మానసికోల్లాసం చేకూరుతుందని, ఆధ్యాత్మిక ఆహ్లాదం కలుగుతుందని దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. అప్పటి దేవస్థానం చైర్మన్ పన్నాలాల్ పిట్టి హయాంలోనే తొలి రాష్ట్రపతి యాదాద్రికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించి ఆలయ చరిత్రపై ఆరా తీశారు. వీరితో పాటు దేశ 9వ రాష్ట్రపతి డాక్టర్ శంకర్దయాల్ శర్మ యాదాద్రీశుడి దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ఆహ్వానంతో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జి 2015 జూలై5 న యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించడంపై సీఎం కేసీఆర్కు ప్రశంసించారు. తాజాగా 15వ రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము నారసింహుడిని దర్శించుకోనున్నారు.
వెయ్యేండ్ల చరిత్ర కలిగిన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్ర కళ్లకు కనిపించేలా దేవస్థానం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ను ప్రధానాలయ మాఢవీధులోని అద్దాల మండపం వద్ద ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా స్వామివారి ఆలయ చరిత్రను రాష్ట్రపతికి వివరించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో అత్యద్భుతంగా ఆలయాన్ని పునర్నిర్మించారు. పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించిన దృశ్యాలు, నిర్మాణ శైలి, తీర్చిదిద్దిన ఘటాలను రాష్ట్రపతి తిలకించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కొండకింద పార్కింగ్ ప్రాంతంలో మూడు హెలిప్యాడ్లను నిర్మించారు. కొండపైకి ప్రత్యేక కాన్వాయ్తో ట్రయల్ రన్ నిర్వహించారు. కొండపైన ఉత్తర రాజగోపురం వద్దకు ప్రత్యేక కూలింగ్ పెయింట్ను వేశారు. త్రితల రాజగోపురం, ఉత్తర రాజగోపురం, ధ్వజ స్తంభం వద్ద ప్రత్యేక పూలమాలలు, మామిడి తోరణాలతో ఆలంకరించారు. రాష్ట్రపతి వచ్చే మార్గంలో రెడ్ కార్పెట్ ఏర్పాటు చేశారు. వీవీఐపీ అతిథి గృహంలో అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచారు. దర్శనానికి వెళ్లే మార్గంలో అవసరం లేని క్యూలైన్ తొలగించారు. ఏర్పాట్లను కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, కాన్వాయ్ ఇన్చార్జి డీసీపీ పద్మజ, ఆలయ ఈవో ఎన్. గీత పరిశీలించి సూచనలు చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వామివారి ప్రత్యేక ప్రసాదాలను అందజేసేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నాణ్యమైన డ్రై ప్రూట్స్తో రామానుజకూటంలో ప్రత్యేకంగా తయారు చేసిన 2 కిలోల కట్టె పొంగళి, పులిహోర, లడ్డూ, కేసరిబాత్, సిరాను అందజేయనున్నారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్, న్యాయమూర్తులు, కలెక్టర్, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ముఖ్య నాయకులు వస్తున్న నేపథ్యంలో వారికి అందించేందుకు కావాల్సిన ప్రత్యేక లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు.