నల్లగొండ జులై 11 : ప్రమాదాలు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేలా భవిష్యత్లో చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే వాహనాల వెనుక వైపు రిఫ్లెక్టర్ రేడియం స్టిక్కర్లను తప్పనిసరిగా వేసుకునే విధంగా జీఓ తీసుకురానున్నట్లు, డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దండంపల్లి వద్ద రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు తిప్పర్తిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాడ్గులపల్లిలో నూతన భవనాల నిర్మాణం, నల్లగొండ బస్టాండ్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం నడపడం, వాహనం ఫిట్నెస్ లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వీటిని తగ్గించేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. మనిషికి జబ్బు చేసినప్పుడు సీటీ స్కాన్ తీసిన విధంగానే ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో సాంకేతిక పరికరాల సహాయంతో సుమారు 15 అంశాల్లో వాహనం రోడ్డుపై తిరిగేందుకు పనికి వస్తుందా లేదా అన్నది నిర్ధారిస్తుందని తెలిపారు.
రవాణా రంగంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటి 8 కోట్ల రూపాయల వ్యయంతో 17 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రవాణా శాఖ ద్వారా స్క్రాపింగ్ పాలసీని తీసుకువచ్చామని, ఏటీసీ వల్ల ప్రతి వాహనం వాహన సారధి పరిధిలోకి వచ్చే విధంగా తెలంగాణను వాహన సారధిలో భాగస్వామ్యం చేసినట్లు చెప్పారు. భవిష్యత్లో డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లను ఆటోమేటిక్గా నిర్వహించి ఆ టెస్ట్ లో పాస్ అయితేనే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు వల్ల 20 నెలల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసినట్లు చెప్పారు. నల్లగొండ జిల్లాకు 70 ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వగా, 10 బస్సులు నార్కెట్పల్లికి, మిగతావి ఇతర ప్రాంతాలకు తిప్పనున్నట్లు వెల్లడించారు. నార్కెట్పల్లికి 80 కొత్త బస్సులు కావాలని, అలాగే నూతన డిపో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీవాణి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ, రవాణా శాఖ కమిషనర్ చంద్రశేఖర్, విశ్రాంత ఆర్టీఓ మోహన్ రెడ్డి, ఆర్టీఓ మెంబర్లు రాజిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Nalgonda : ప్రమాదాలు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్