చిలుకూరు, మార్చి18 : వీధి కుళాయిల దగ్గర మహిళలు నిలబడి తలపడే పాత రోజులు మళ్లీ వచ్చాయి. చిలుకూరు మండల వ్యాప్తంగా తాగు నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో బోర్లు, బావులు ఎండిపోయి కరువుతాండవిస్తున్నది. ఒకవైపు ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని పడుతున్న దృశ్యాలు కనిపిస్తుండగా, మరోవైపు తాగునీటికీ అదే పరిస్థితి తలెత్తింది. తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు లేక మహిళలు ట్యాంకర్ల నీటి కోసం ఎదురుచూస్తున్నారు.
వచ్చిన ట్యాంకర్ వద్ద లైన్లో నిల్చొని బిందెలు, బకెట్లలో పట్టుకుంటున్నారు. గ్రామాల్లోకి మిషన్ భగీరథ నీరు రాకపోవడం, స్థానికంగా బోర్లు వట్టిపోవడంతో మండలంలోని జానకీనగర్, జెర్రిపోతులగూడెం గ్రామాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. అధికారులు, ప్రజాప్రతినిధులకు సమన్వయం లేకపోవడం, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే నీటి సమస్య తలెత్తుతున్నదని ప్రజలు మండిపడుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే ఇలా ఉంటే ఎలా అని, ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.