నందికొండ, ఏప్రిల్ 15 : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పక్కనే ఉన్నా నందికొండ మున్సిపాలిటీ వాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు. పైలాన్, హిల్కాలనీలకు ఎన్నెస్పీ అధికారలు తాగునీటిని నీటి సరఫరా చేస్తున్నారు. అయితే ఆయా కాలనీలకు నీటిని సరఫరా చేసే ఫిల్టర్ హౌస్ మోటర్లు మొరాయిస్తుండడంతో కాలనీ వాసులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. పైలాన్కాలనీ వాసులుకు నీటిని సరఫరా చేసే పంపు చెడి పోవడంతో వారం రోజులుగా కాలనీ ప్రజలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దాంతో ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు.
మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా, మరి కొందరు పబ్లిక్ ట్యాంకుల వద్ద నీటిని పట్టుకొని వెళుతున్నారు. నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా తాగునీటి కోసం అవస్థలు పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై ఫిల్టర్ హౌస్ ఏఈ భిక్షంను వివరణ కోరాగా పైలాన్కాలనీకి నీటి సరఫరా చేసే పంపు పాడైపోవడంతో వారం రోజులుగా నీటి సరఫరా నిలిచి పోయిందని తెలిపారు. కొత్త పంపును ఏర్పాటు చేసినా.. పంపు మొరాయిస్తుందని పేర్కొన్నారు. త్వరగా బాగు చేసి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు.