దామరచర్ల, ఏప్రిల్ 13 : మండలంలో తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీన నమస్తే తెలంగాణ పత్రికలో ‘పల్లెల్లో నీటి సమస్య’ అనే కథనానికి అధికారులు స్పందించారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ సంపత్, ఏఈ రవికిరణ్ ఆధ్వర్యంలో సిబ్బంది మండలంలోని రాజగట్టు, కొండ్రపోల్, తిమ్మాపురం, తెట్టకుంట తదితర గ్రామాల్లో నెలకొన్న బోర్లు, పైపులైన్ల సమస్యలను పరిష్కరించారు.
లీకేజీలు ఉన్న పైపులను తొలగించి కొత్త పైపులను బిగించి తాగునీటిని అందించారు. దీనితోపాటు నీటి సమస్య ఉన్న మరికొన్ని గ్రామాల్లో కూడా సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మండలంలో మిషన్ భగీరథ నీరు ప్రతి గ్రామానికీ అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు లేక రక్షిత నీటి పథకాలు కొన్ని పనిచేయడం లేదని, దాంతో అద్దెబోర్లు తీసుకొని వాటి ద్వారా నీటిని అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.