యాదాద్రి, డిసెంబర్ 23 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి ఈ నెల 30న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. ఉదయం 9.30 గంటలకు యాదాద్రికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి శీతాకాల విడిదిలో భాగంగా తెలంగాణకు వస్తున్న ద్రౌపదీ ముర్ము యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. 15 మంది రాష్ట్రపతుల్లో ఇప్పటి వరకు నలుగురు మాత్రమే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా ద్రౌపదీ ముర్ము స్వామివారిని దర్శించుకున్న ఐదో రాష్ట్రపతిగా నిలువనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1,100 కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని దేశమే గర్వపడే విధంగా పూర్తిగా కృష్ణశిలతో పునర్నిర్మించారు. ఇంత స్థాయిలో ఆల యం నిర్మించిన దాఖలాలు లేవని దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న ది. ఈ నేపథ్యంలో దేశ, విదేశాల నుంచి వీఐపీల తాకిడి పెరుగుతూ వస్తున్నది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక హెలికాప్టర్లో యాదాద్రికి రానున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్చార్జి ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు లక్ష్మీనారాయణ, షమీర్, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, పట్టణ సీఐ సైదయ్య శుక్రవాం హెలిప్యాడ్ స్థలాలను పరిశీలించారు.
రాష్ట్రపతి పర్యటన ఇలా…
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 30న ఉదయం 8.50 గంటలకు హైదరాబాద్లోని బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఈఎంఈ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఏఎఫ్ ఎం17 హెలికాప్టర్లో యాదగిరిగుట్ట దేవస్థానం వద్ద హెలిప్యాడ్ స్థలానికి చేరుకుంటారు. 9.50 గంటలకు ప్రత్యేక వాహనంలో కొండపైకి బయల్దేరుతారు. 10 నుంచి 10.30 గంటల మధ్య స్వయంభూ నరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. 10.40కి యాదాద్రి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 10.50 గంటలకు తిరిగి హైదరాబాద్లోని బొల్లారం హెలిప్యాడ్ వద్దకు, 11.30 గంటలకు రాష్ట్రపతి భవన్కు చేరుకుంటారు.
స్వామివారిని దర్శించుకున్న నలుగురు రాష్ట్రపతులు..
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారన్న సమాచారంతో గతంలో యాదగిరీశుడిని దర్శించుకున్న రాష్ట్రపతులపై చర్చ సాగుతున్నది. తొలి రాష్టపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్, 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణణ్, 9వ రాష్ట్రపతి డాక్టర్ శంకర్దయాల్శర్మ, 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా 15వ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నారసింహుడిని దర్శించుకోనున్నారు.