కాంగ్రెస్ అధిష్టానం ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు నడుచుకోవడం లేదని, బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ గౌడ్ అన్నారు. కోమటిరెడ్డి, రేవంత్రెడ్డి వంటి వారి చేతుల్లోనే కాంగ్రెస్ ఉన్నదని, బీసీ నాయకులు, ఉద్యమ నాయకులకు తీవ్ర అవమానం జరుగుతున్నదని మండిపడ్డారు. నల్లగొండలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కోమటిరెడ్డి నల్లగొండలో ఎట్లా గెలుస్తాడో చూస్తానని సవాల్ చేశారు.
నల్లగొండ, అక్టోబర్ 20 : ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం చెబుతుంటే.. వారి మాటలను ఆ పార్టీ రాష్ట్ర నేతలు పట్టించుకోకుండా టికెట్లు కేటాయిస్తున్నారని, అసలు ఆ పార్టీలో బీసీలకు స్థ్దానమే లేదని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ గౌడ్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎస్బీఆర్ గార్డెన్స్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అగ్రవర్గాలకు అడ్డాగా మారిందని.. కోమటిరెడ్డి, రేవంత్రెడ్డి లాంటి వాళ్లు ఆ పార్టీని కబ్జా చేశారని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానం లేదని ఆరోపించారు. కోమటిరెడ్డి తిట్ల దండకం, ఇతరులను రెచ్చగొట్టడం చేపడుతూ పీసీసీ చీఫ్ను సైతం వణికిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు ప్రాధాన్యత ఇస్తామంటున్న కాంగ్రెస్.. బీసీల ఓట్లు లేని, బలం లేని ప్రాంతాల్లో 12 సీట్లు ఇచ్చి ఉదయపూర్ డిక్లరేషన్ పాటిస్తున్నామని చెప్పుకొంటే ఎలా అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తులే తనను సుధాకరన్నా అని గౌరవించారని, తెలంగాణ బిడ్డలకు అధికారం కన్న ఆత్మ గౌరవమే ప్రధానమని, కాంగ్రెస్లో కనీస గౌరవం లేక పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నల్లగొండ నిరుద్యోగ సభలో నలుగురు అగ్రవర్ణాల వారు చేతులు కలిపి ఇది మా బలగం అంటే జనం నమ్మబోరని, ఆ సభలో బీసీ నాయకుడిని, ఉద్యమకారుడిని స్టేజీ ఎక్కకుండా అవమానించి మా బలగం అనడం సిగ్గుగా ఉన్నదన్నారు. మీ ప్రదర్శన బలగం కాదని, బడుగు బలహీన వర్గాలను పీల్చి పిప్పి చేసే జలగల ప్రదర్శన అని విమర్శించారు. నల్లగొండలో బీసీలకు టికెట్ ఇస్తానని మాట్లాడితే సరిపోదు.. దమ్ముంటే ఇచ్చి చూపించాలని సవాల్ చేశారు.
లక్ష్మికి టికెట్ ఇచ్చి మాట నిలబెట్టుకుంటే.. తాను కాంగ్రెస్లో ఉండి ఆమె గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించారు. తన కొడుకుకు ఫోన్ చేసి బెదిరించడం కాదు. బిడ్డా కోమటిరెడ్డీ.. నల్లగొండలో ఎట్లా గెలుస్తావో చూస్తానని సవాల్ చేశారు. ‘నీకు తెల్వకుండా నేను కాంగ్రెస్లో చేరితే తప్పు. నాకు తెల్వకుండా నువ్వు వీరేశాన్ని చేర్చుకొని నకిరేకల్లో ఎలా ఊరేగుతున్నావ్’ అని ప్రశ్నించారు. ఆయన నకిరేకల్లో ఎలా గెలుస్తాడో చూస్తానని అన్నారు.
మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయమని చెప్పి అక్కడ స్రవంతికి డిపాజిట్ కూడా రాదని నువ్వు శపథం చేస్తే.. తాము తిరిగి 23వేల ఓట్లు సాధించినది కాంగ్రెస్ పెద్దలకు తెల్వదా? అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి భయానికి తనతో పాటు నందికంటి శ్రీధర్ లాంటి వారికి కాంగ్రెస్ అన్యా యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు ఎన్నో ఏండ్లు సేవలు చేసిన పొన్నాల లక్ష్మయ్యను వెళ్లగొట్టడానికి అక్కడ ఇద్దరు అగ్రవర్ణాల వారిని రెచ్చగొట్టి కోమటిరెడ్డి అన్యాయం చేశాడన్నారు.
నల్లగొండలో నయీం బాధితులు ఎంత మంది ఉన్నారో.. కాంగ్రెస్లో కూడా కోమటిరెడ్డి బాధితులు అంతే మంది ఉన్నారని, ఇకనైనా అధిష్టానం గుర్తించకపోతే ఆ పార్టీలో కింది స్థాయి వర్గాలకు న్యాయం దక్కదని తాను 2003లోనే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరి ఒక వ్యక్తి అధిష్టానానికి ఇచ్చిన తప్పుడు సమాచారం వల్ల ఆయన టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే అయ్యాడని, అలాంటి వ్యక్తి విషపు కోరలు ఆ పార్టీ అధిష్టానానికి తెలిసి బయటకు పంపడం సంతోషకరమన్నారు. అలాంటి వ్యక్తులకు మళ్లీ గుణపాఠం చెప్పాల్సి ఉన్నదని వేముల వీరేశాన్ని ఉద్దేశించి చెప్పారు. బీఆర్ఎస్లో ఉద్యమకారులకు మరోసారి సముచిత స్థానం ఇచ్చే విధంగా అధిష్టానం ఆలోచన చేయడం సంతోషమన్నారు. తాను కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నానని, ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని చెప్పారు. సమావేశంలో చెరుకు లక్ష్మి, షేక్ చాంద్, చంద్రకాంత్రెడ్డి, సందీప్ చౌక, రాందాస్, అనంతుల మధు, సైదులు పాల్గొన్నారు.