– యాదవ ఉద్యోగుల సంఘం, టీఎన్జీవో నాయకులు
రామగిరి, ఏప్రిల్ 03 : దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అమర వీరుడిగా నిలిచి, ఆయన త్యాగం ప్రజల్లో స్వేచ్ఛా భావాన్ని, సమానత్వం కోసం పోరాడే స్ఫూర్తిని నింపిందని, ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తుందని నల్లగొండ జిల్లా యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు తరాల పరమేశ్ యాదవ్, టీఎన్జీఓస్ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగెళ్లి మురళి, జె.శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 1946 జూలై 4న విసునూరు రామచంద్రారెడ్డి అల్లరి మూకల రౌడీలతో కలిసి సుమారు 40 మంది వచ్చి ప్రజలపై దాడులకు దిగిన ఘటనను గుర్తు చేశారు. ప్రజలతో కలిసి కర్రలు, బడిశెలు, గునపాలతో ప్రతిఘటించిన గుండాలను తరిమికొట్టే ప్రయత్నంలో దొడ్డి కొమురయ్య ముందుండి పోరాడినట్లు వివరించారు.
ఈ క్రమంలో ఆయనపై కాల్పులు జరగడంతో అమరుడైనట్లు పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య మరణ వార్త జనగాం ప్రాంతంతో పాటు ఆంధ్ర మహాసభ కార్యకర్తలందరికీ విస్తరించి, దేశముఖ్, విసునూరు అధికారుల పీడనలకు వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు స్పూర్తిని రగిలించిందని చెప్పారు. నైజాంలు, దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటం ప్రజాస్వామ్య దిశగా తెలంగాణలో మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి దీప్తిగా నిలిచి, రైతాంగంలో చైతన్యం నింపిందని తెలిపారు. ఆయన ఆశయాలు సామాజిక న్యాయం సాధనకు నేటికీ మార్గదర్శకంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సంజీవయ్య, వార్డెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రణదీవె, యాదవ్, ఉద్యోగుల సంఘం నాయకులు కడారి యాదయ్య, చింతకాయల రామచంద్రు, తరాల జగదీష్, అల్లి సతీష్, రాయనబోయిన రాంబాబు, బారి శ్రీనివాస్, టీఎన్జీవోస్ నాయకులు సత్యనారాయణ, సుమన్, కవిత, జ్యోతి పాల్గొన్నారు.

‘తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి దీప్తి దొడ్డి కొమురయ్య’