కోదాడ, జూన్ 20 : దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి మార్గమని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కె.సురేష్ అన్నారు. శనివారం కోదాడ కోర్టులో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ తో కలిసి జాతీయ లోక్ ఆదాలత్ ను ప్రారంభించి మాట్లాడారు. రాజీ మార్గమే రాజ మార్గమని, కక్షలు, పట్టింపులకు పోయి కక్షిదారులు నష్టపోవద్దని సూచించారు. సత్వర న్యాయానికి లోక్ అదాలత్ లు సహకరిస్తాయని, కక్షిదారులు ఇట్టి అవకాశాన్నిసద్వినియోగం చేసుకుని విలువైన కాలాన్ని, ఆర్థిక నష్టాన్ని కాపాడుకుని ప్రశాంత జీవనాన్ని గడపాలని సూచించారు.
కోదాడ కోర్టులో క్రిమినల్ కేసులు 48, సివిల్ 8, బ్యాంక్ కేసులు 24 పరిష్కరించారు. బ్యాంక్ కేసుల రికవరీ రూపంలో రూ.10 లక్షలు వసూలు చేశారు. అడ్మిషన్ కేసులు 86, పిట్టి కేసులు 976 పరిష్కరించి 4 లక్షల 77 వేల రూపాయలు ఫైన్ రూపంలో వసూలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, కార్యదర్శి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ జానీ పాషా, ట్రెజరర్ వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాదులు మేకల వెంకట్రావు, పాలేటి నాగేశ్వరరావు, చింతకుంట్ల రామిరెడ్డి, తమ్మినేని హనుమంతరావు, గోవర్ధన్, రవికుమార్, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.