సిటీబ్యూరో, జనవరి 10(నమస్తే తెలంగాణ) : ఈ సంక్రాంతికి ఊరెళ్తున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ సూచిస్తున్నారు. దొంగలకు ఇలాంటి సమాచారం లభించినప్పుడు వారు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఊరికి వెళ్తున్నట్లు పోస్టింగ్ పెట్టిన వారి ఇంటి ఆచూకీ కనుగొని చోరీ చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పండుగ వేళ దొంగతనాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్ కింద కాలనీలు, బస్తీల వారిగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవడంతో పాటు చోరీలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నట్లు మహేశ్ భగవత్ చెప్పారు. గల్లీ గస్తీతోపాటు నైట్ పెట్రోలింగ్ పెంచామన్నారు. నిర్లక్ష్యం వదిలి విలువైన వస్తువులు, నగదు లాకర్లో పెట్టుకోవాలన్నారు. దొంగతనాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేలా సోమవారం ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో సిబ్బందితో కలిసి పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.
చైనా మంజా వాడితే జైలే…
సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగిరేసే వారు చైనా మంజాను వాడొద్దని సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా శిక్షలు తప్పవని హెచ్చరించారు. చైనా మంజాను వాడే వారిపై సెక్షన్ 336(ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించడం-3 నెలలు కనీస జైలు శిక్ష…), 188 ఐపీసీ(ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించడం), సెక్షన్ 15, ఎన్విరాన్మెంట్ యాక్ట్ కింద అభియోగాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు.
జూదంపై సమాచారం ఇవ్వాలి
సంక్రాంతి సందర్భంగా జూదం, కోడి పందేలు, ఇతర బెట్టింగ్లపై సమాచారం ఇవ్వాలని సీపీ మహేశ్ భగవత్ కోరారు. డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ నెం.9490617111కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. కోడిపందేలు నిర్వహించిన కొంతమందిపై మేడిపల్లి పీఎస్లో కేసులు నమోదు చేశామని సీపీ స్పష్టం చేశారు.