సూర్యాపేట, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల అటెండెన్స్ కోసం సూర్యాపేట డిస్ట్రిక్ట్ అటెండెన్స్ మేనేజ్మెంట్ యాప్ను తీసుకొస్తున్నారు. ఈ యాప్ను ఇటీవలే కలెక్టరేట్లో ప్రారంభించగా.. త్వరలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తున్నది.
అయితే.. ఈ యాప్పై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యాప్ వల్ల జరిగే లాభనష్టాలను బేరీజు వేసుకోకుండానే ఆదరాబాదరాగా ప్రారంభించారని వాపోతున్నారు. యాప్తో ఉదయం చెక్ ఇన్, సాయంత్రం చెక్ ఔట్ ఆప్షన్లు నొక్కాల్సి ఉండగా.. కింది స్థాయి ఉద్యోగుల్లో 60 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో ఇబ్బంది కానుంది. అంతేకాదు.. యాప్ ద్వారా ఏ ఉద్యోగి ఎప్పుడు, ఎక్కడ ఉంటాడో తెల్వడం ద్వారా వ్యక్తిగత ప్రైవసీని కూడా కోల్పోనున్నారు. ఈ క్రమంలో అవసరమైతే బయోమెట్రిక్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, యాప్ను వెంటనే తొలగించాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.
పాఠశాలల నుంచి ప్రభుత్వ కార్యాలయం వరకు ప్రతి చోటా ఉద్యోగులు సకాలంలో వచ్చి వెళ్లేందుకు అటెండెన్స్ అనే ప్రక్రియ ఉన్నది. అయితే.. హాజరు అనేది గతంలో మ్యానువల్గా ఉండి సంతకాలు చేసేవారు. రానురాను టెక్నాలజీ పెరుగుతూ అనేక రకాల మార్పులు జరుగుతూ వచ్చాయి. అటెండెన్స్ రిజిస్టర్ నుంచి బయోమెట్రిక్, ఫేస్ రికగ్నైజ్ వంటి అనేక రకాల ఈ-అటెండెన్స్లు అమల్లోకి వచ్చాయి. ఇలాంటి మార్పులతో ఉద్యోగికి నష్టం చేకూరనంత వరకు బాగానే ఉంటుంది.
ఒకవేళ నష్టం చేకూరే అవకాశం ఉంటే ఆచితూచి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సూర్యాపేటలో ఉన్నతాధికారులు ఒక యాప్ను తీసుకొచ్చారు. సదరు కార్యాలయానికి వచ్చినప్పుడు ఆ యాప్లో చెక్ ఇన్, బయటకు వెళ్లే సమయంలో చెక్ అవుట్ చేయాల్సి ఉంటుంది. చెప్పుకొనేందుకు ఎంతో సులువుగా ఉన్నా.. దీని ద్వారా అనర్థాలు జరిగే ప్రమాదంతోపాటు చిరు ఉద్యోగులపై కాసింత భారం కూడా పడనున్నది. యాప్తో అటెండెన్స్ వేయాలంటే కచ్చితంగా స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ డాటా ఉండాల్సిందే.
దాంతోపాటు ఈ యాప్ను ప్రైవేట్ వ్యక్తులు తయారు చేసినందున ఉద్యోగుల వేతనాల కోసం ట్రెజరీకి లింక్ చేయనుండడంతో సైబర్ నేరాలు జరిగే ప్రమాదం ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యాప్ వినియోగించే వారు ఎప్పుడు, ఎక్కడ ఉంటారో తెలుసుకునే అవకాశం ఉన్నందున వ్యక్తిగత ప్రైవసీ దెబ్బతిననుంది. ఇప్పటికే జిల్లాలో ఉద్యోగులంతా బాగా పని చేయడం వల్ల రాష్ట్రంలోనే జిల్లాకు మంచి పేరు ఉన్నది. ఈ క్రమంలో ఈ యాప్తో సాధించేదేమీ ఉండదని.. దాంతో ఉద్యోగుల ఆత్మైస్థెర్యం దెబ్బతీయడంతోపాటు స్మార్ట్ ఫోన్లు లేనివారు, అవగాహన లేని చిరు ఉద్యోగులు ఇబ్బందులు పడుతారని పలువురు పేర్కొంటున్నారు.