నల్లగొండ ప్రతినిధి, మే 16 (నమస్తే తెలంగాణ) : కొందరు దళారులు అత్యాశతో అమాయక రైతులను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటారు. రైతులు తకువ ధరకు వస్తున్నాయని తీసుకొని మోసపోతుంటారు. అయితే నకిలీ విత్తనాలతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక అప్పుల పాలవుతుంటారు. ఇలాంటి దళారులను కట్టడి చేయడానికి ప్రభుత్వం సీరియస్గా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జిల్లాలో నకిలీ విత్తనాల కట్టడి కోసం పోలీస్, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. మండల, డివిజన్ స్థాయితోపాటు జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నకిలీ విత్తనాలు ఎకువగా మండల కేంద్రంతోపాటు గ్రామీణ స్థాయిలో రవాణా జరిగేందుకు వీలుండడంతో అకడే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గతంలో నకిలీ విత్తన నేరాలకు పాల్పడిన వ్యక్తులపై నిఘా ఉంచడంతోపాటు వారిని బైండోవర్ కూడా చేయనున్నారు. మళ్లీ కొత్తగా కేసులు నమోదైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
ప్రభుత్వ మార్గదర్శకాలు ఇలా..
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపేలా రాష్ట్ర సర్కార్ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. రా్రష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం జిల్లా యంత్రాంగాలతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గడువు ముగిసిన విత్తనాలను, లైసెన్స్ లేకుండా విక్రయించే వాటిని, ఒక ప్రాంతంలో లైసెన్స్ కలిగి ఉండి వేరేచోట విక్రయాలు జరిపే వారిపైనా దృష్టి పెట్టనున్నారు. స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్ నిర్వహణ వంటి చిన్న చిన్న లోపాల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి వాటిని గుర్తించినప్పుడు విత్తన డీలర్లను అప్రమత్తం చేస్తూ లోపాలను సవరించుకునేలా చర్యలు చేపడుతారు. డీలర్లలో మార్పు రాకపోతే నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు. నకిలీ విత్తనాల దందాను నిర్వహించే వారిని గుర్తిస్తూ, అవసరమైతే పీడీ యాక్టులు ప్రయోగించనున్నారు. నకిలీ విత్తనాల కేసులతో సంబంధం ఉన్న పాత నేరస్తులను తాసీల్దార్ల ఎదుట బైండోవర్ చేయాల్సి ఉంది.
పకడ్బందీగా తనిఖీలు
ఆంధ్రా, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి నకిలీ సీడ్స్ మన రాష్ట్రంలోకి ఎక్కువగా వస్తున్నట్లు గతంలో గుర్తించారు. దీంతో ఈ ఏడాది కూడా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఏపీ రాష్ట్ర సరిహద్దు రహదారులపై ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. టాస్ఫోర్స్ బృందాలు సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగిస్తూ విస్తృతంగా తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలిచ్చారు. జిల్లా నుంచి క్షేత్రస్థాయి వరకు నిఘా కోసం మండల, డివిజన్ స్థాయిలో కమిటీలతోపాటు జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో సైతం ఒక్క గింజ నకిలీ విత్తనం కనిపించినా అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. నల్లగొండ జిల్లాలో క్రాసింగ్ యూనిట్ ఒకటి మాత్రమే ఉండడంతో అకడ శాంపిల్స్ సైతం సేకరించారు. జిల్లాలో 915 లైసెన్స్డ్ రిటైల్ దుకాణాలు ఉండగా, వారికి కూడా నకిలీ విత్తనాలపై పలు సూచనలు జారీ చేశారు. ముందుగా క్రాసింగ్ యూనిట్లో పూర్తిచేసి, రెండో దఫాలో విత్తనాలు ఉంచే గోదాముల్లో తనిఖీలు చేసి, చివరిగా లైసెన్స్ రిటైల్ సీడ్స్ దుకాణాలను క్షుణ్ణంగా పరిశీలించేలా చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో పాత నేరస్తులతోపాటు దళారుల కదలికలపైనా వ్యవసాయ అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. సాధారణంగా నకిలీ విత్తనాలను మండల కేంద్రాలు, అక్కడి నుంచి గ్రామాల్లో విక్రయిస్తుంటారు. విత్తన సంచులపై లేబుల్, తెల్లని సంచులు, విత్తనాలు, కాల పరిమితి వంటి స్టికర్లు లేకుండా విక్రయిస్తుంటే అవి నకిలీగా భావిస్తుంటారు. సాధారణంగా 450 గ్రాముల పత్తి విత్తనాల సంచి ఈ ఏడాది 853 రూపాయలకు విక్రయించాల్సి ఉంది. అంతకు ఎక్కువ ధరకు విక్రయించినా, బల్క్గా విక్రయించినా నిఘా బృందాలు రంగంలోకి దిగనున్నాయి.
పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలపై పటిష్ట నిఘా పెడుతున్నాం. వ్యవసాయ శాఖతో కలిసి సంయుక్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయి వరకు నిరంతర నిఘా కొనసాగుతోంది. అంధ్రా రాష్ట్రంతోపాటు మహబూబ్నగర్ జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులతో తనిఖీలు నిర్వహిస్తాం. టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతరం క్షేత్రస్థాయిలో రంగంలో ఉంటాయి. పాత నేరస్తులపైనా నిఘా పెట్టాం. బైండోవర్స్ కూడా చేస్తున్నాం. అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం. నకిలీ విత్తనాలను అరికట్టడమే లక్ష్యం.
– కె.అపూర్వరావు, నల్లగొండ జిల్లా ఎస్పీ
రైతులు అప్రమత్తంగా ఉండాలి
నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అనుమానులు ఉన్నా వెంటనే సమాచారం ఇవ్వాలి. వ్యవసాయ లేదా పోలీసు అధికారులకు తెలియజేయాలి. తక్కువ ధరకు లేదా సరైన లేబుల్, సమాచారం లేని విత్తనాల పట్ల రైతులు జాగ్రత్త వహించాలి. అవసరమైతే క్రాస్ చెక్ చేసుకుని కొనుగోలు చేయాలి. నాణ్యమైన, బ్రాండెడ్ విత్తనాలతోనే మంచి దిగుబడులు సాధ్యం. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పకుండా బిల్లుతోపాటు విత్తన ప్యాకెట్లను భద్రపర్చాలి. ఏదైనా పరిస్థితుల్లో నష్టం జరిగితే విత్తన బీమా వర్తిస్తుంది. బిల్లు ఉంటేనే సదరు విత్తన సంస్థపైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
– సుచరిత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, నల్లగొండ