– సీఎం రేవంత్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నేత ఉదావత్ లచ్చిరాం లేఖ
రామగిరి, జూలై 07 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అత్యాధునిక డిజిటల్ ప్యానెల్ బోర్డులు (Interactive Flat Panels) అందించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి, సీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉదావత్ లచ్చిరాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. ఇప్పటికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ ప్యానెల్ బోర్డుల ఏర్పాటు ద్వారా బోధనలో నాణ్యత పెరిగిందని, అదే అవకాశాన్ని ప్రాథమిక పాఠశాలలకు కూడా కల్పించడం కాలానుగుణ అవసరమని తెలిపారు. విద్యకు పునాది ప్రాథమిక దశ. ఈ దశలోనే విద్యార్థులు దృశ్య, శ్రవణ ఆధారిత అభ్యాసాన్ని అత్యంత వేగంగా గ్రహిస్తారన్నారు.
వర్చువల్ లెర్నింగ్ అలాగే కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత బోధనను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా విద్యార్థుల్లో అభ్యాసంపై ఆసక్తి, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు గణనీయంగా పెరుగుతాయని లచ్చిరాం అన్నారు. ఇది విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసాన్ని మరింత పెంచి, విద్యార్థుల నమోదు (ఎన్రోల్మెంట్) సంఖ్య పెరగడానికి కూడా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రాథమిక విద్యను డిజిటల్ యుగానికి అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని లేఖలో ఆయన కోరారు.