‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాం. గతంలో కంటే సర్కారు దవాఖానల్లో ప్రసవాలు, ఆరోగ్యశ్రీ సేవలు గణనీయంగా పెరిగాయి. జిల్లాల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోనూ రాబోవు రోజుల్లో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తాం. భువనగిరి దవాఖానను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి మంత్రి వచ్చారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రూ.1.25కోట్లతో ఏర్పాటు చేయనున్న టీ-డయాగ్నస్టిక్ సెంటర్, రూ.74లక్షలతో చేపట్టే ఆధునీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.46లక్షలతో ఏర్పాటు చేసిన 20 పడకలఎస్ఎన్సీయూ (నవజాత శిశువు స్థిరీకరణ), 30 పడకల డీపీఎస్యూ (ఇంటెన్సివ్ పిడియాట్రిక్ కేర్) కేంద్రాలను ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు మంత్రి హరీశ్రావు పలు వరాలు ప్రకటించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, సిజేరియన్లను పూర్తిగా తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచాలని సూచించారు.
యాదాద్రి భువనగిరి, మే 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భువనగిరి ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు కేర్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం అయితే ఇప్పుడు 56 శాతం అవుతున్నాయన్నారు. 26 శాతం ప్రసవాలు పెరిగాయని తెలిపారు. అదేవిధంగా గత మూడు నెలల్లో ఆరోగ్యశ్రీ సేవలు 8 శాతం పెరిగాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం డబ్బు ఏండ్లలో తెలంగాణలో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే ఏడేండ్లలో 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పట్టుదల వల్లనే ఇదంతా సాధ్యమవుతున్నదన్నారు. ఆసుపత్రిలో ఐసీయూ, డయాలసిస్, బేబీ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశామని, అవసాన దశలో ఉన్న వారికి వైద్యం, భోజన వసతి సదుపాయం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, కలెక్టర్ పమేలా సత్పతి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్రావు, జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్రావు, ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, డైరెక్టర్ కల్నల్ ఎస్పీ అనంతరావు, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చిన్నానాయక్ పాల్గొన్నారు.
వరాల జల్లు
జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవల కోసం పలు సదుపాయాలను కల్పించాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి హరీశ్రావు పలు వరాలు ప్రకటించారు. భువనగిరి మున్సిపాలిటీలో మూడు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరమ్మతులతోపాటు ఆసుపత్రి ఆధునీకరణ, నూతన నిర్మాణాల కోసం రూ. 74 లక్షల పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని నెల రోజుల్లో అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి హామీఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు విజ్ఞప్తి మేరకు భువనగిరి ఆర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధునీకరణకు రూ.కోటి నిధులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. జిల్లా కేంద్రంలో త్వరలోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.