వ్యవసాయం పచ్చగ కళకళలాడుతుందన్నా.. రైతన్న చల్లగ ఉంటుండన్నా.. పల్లెల్లో భూ వివాదాలు నామమాత్రంగా మారాయన్నా.. అందుకు కారణం ధరణి అని చెప్పడంలో సందేహం లేదేమో. భూ సంబంధిత, ఆ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు, ఇతర సమాచారంతో నిక్షిప్తమైన ధరణి ఎన్నో విప్లవాత్మక మార్పులకు కారణమైంది. భూముల క్రయవిక్రయాలతోపాటు వ్యవసాయరంగంలోనూ ధరణి పాత్ర విడదీయలేనిదిగా మారింది. అన్నింటికీ ధరణి పోర్టలే కీలకం. దాంతో క్షణాల్లో ఏ సమాచారమైనా రైతులకు చేరిపోతున్నది.
నేరుగా ప్రతి విషయం రైతుల సెల్ఫోన్లకు మెసేజ్ రూపంలో వచ్చి పడుతున్నది. రైతుబంధు, రైతు బీమా, ధాన్యం డబ్బుల చెల్లింపులు ఇలా ఏ లావాదేవీలైనా మధ్యవర్తులకు స్థానం లేకుండా నేరుగా రైతులతోనే జరిగిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 25 లక్షల ఎకరాలకు సంబంధించిన 10.81లక్షల మంది రైతుల సమాచారం ధరణిలో నిక్షిప్తం కావడం విశేషం. ఇలా నిత్యం దైనందిన సాగు జీవితాలతో పెనవేసుకుపోయిన ధరణిని రద్దు చేస్తామంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పాలన నాటి అవినీతి, అక్రమాలు, లంచాలు, పైరవీలకు పెద్ద పీట వేయదలుచుకున్నారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, మే 30 (నమస్తే తెలంగాణ) : భూ లావాదేవీల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులకు కారణమైన ధరణి పోర్టల్ 2020 అక్టోబర్ 29నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే.. అంతకుముందే దీనిపై సీఎం కేసీఆర్ కొన్నాళ్లుగా కసరత్తు చేస్తూ వచ్చారు. భూ రికార్డుల ప్రక్షాళనతోపాటు పకడ్బందీ విధానాన్ని రూపొందిస్తూ రైతుల సమగ్ర సమాచారాన్ని సైతం ఇందులో పొందుపర్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. భూమి ఉన్న ప్రతి రైతు పక్కాగా యాజమాన్యపు హక్కు కలిగి ఉండేలా.. రైతు ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, సెల్ఫోన్ నంబర్ను కూడా జత చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి ఏ సమాచారం చేరవేయాలన్నా ప్రస్తుతం ధరణి సమాచారమే కీలకమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 10.81లక్షల మంది రైతుల సమాచారం ధరణి పోర్టల్లో నిక్షిప్తమైంది. నల్లగొండ జిల్లాలో 5.20లక్షలు, సూర్యాపేటలో 3లక్షలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.61 లక్షల మంది రైతుల సమగ్ర సమాచారం అందుబాటులో ఉన్నది. ఇవి కాకుండా నిత్యం భూ లావాదేవీలు జరిగాక సమాచారం ఆటోమెటిక్గా అప్డేట్ అవుతూ వస్తున్నది. దీనివల్ల ప్రభుత్వానికి, క్షేత్ర స్థాయిలోని రైతులకు మధ్య సమన్వయం ఏర్పడింది.
రైతు బీమాకు ధరణి కీలకం
రైతు బీమాకు సైతం ధరణినే ఆధారమైంది. ప్రతి యేటా ఆగస్టులో రైతు బీమా కోసం ప్రీమియం చెల్లిస్తూ, రెన్యూవల్ చేసే సమయంలో పాత రైతుల సమాచారం నేరుగా ధరణి పోర్టల్ నుంచే తీసుకుంటున్నారు. తాజాగా భూ హక్కులు కలిగిన రైతుల నామినీ, ఆధార్ వివరాల సేకరణతోనే సరిపోతుంది. ఒక్కసారి రైతుబీమాలో నమోదు చేసుకుంటే ప్రతి ఏటా ధరణి సమాచారం ఆధారంగా బీమా కల్పిస్తున్నారు. రైతుబీమా పథకంలో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 5.42లక్షల మంది రైతులు అర్హులుగా నమోదై ఉన్నారు. 2018లో పథకం ప్రారంభమైనప్పుడు 4.51లక్షల మంది మాత్రమే ఉండగా అదనంగా 91వేల మంది బీమా పథకంలోకి వచ్చారు. ఈ పథకంలో ఉన్న రైతు ఏ కారణం చేతనైనా మరణిస్తే నేరుగా ధరణి సమాచారం ఆధారంగానే క్లెయిమ్ చెల్లిస్తున్నారు.
మధ్యవర్తులకు సంబంధం లేకుండా నేరుగా రైతు కుటుంబ సభ్యుల ఖాతాల్లోకే వారం రోజుల్లోనే ఐదు లక్షల నగదు వచ్చి చేరుతుంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 12,770 క్లెయిమ్లకుగాను రూ.630 కోట్లు మరణించిన రైతు కుటుంబాలకు చేరాయి. గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే రైతు మరణిస్తే అప్పట్లో ప్రభుత్వం ఇచ్చే 50వేల రూపాయల ఆపద్బంధు పథకం కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. మరణానంతరం దీని కోసం దరఖాస్తు చేసుకోవడమే గగనంగా ఉండేది. తర్వాత పైరవీలు చేసి వాటాలు పంచితే తప్ప ఆపద్బంధు డబ్బు చేతికి అందేది కాదు. అంతా పోగా రూ.30వేల వరకు రైతుకు చేరితే అదే ఎక్కువ. కానీ.. నేడు ధరణి ఆధారంగా మధ్యవర్తులకు స్థానం లేకుండా నేరుగా బాధిత రైతు కుటుంబానికే చెందుతుండడం విశేషం. ఇంతటి పారదర్శక విధానానికి ధరణి అత్యంత కీలకం.
రైతుబంధుకు ఇదే ఆధారం
వ్యవసాయాన్ని పండుగలా మార్చాలన్న సంకల్పంలో భాగంగా ప్రతి సీజన్లో అందజేస్తున్న రైతుబంధుకు ధరణి పోర్టల్ సమాచారమే మూలం. దీని ఆధారంగానే రైతులకు ఉన్న భూ విస్తీర్ణానికి అనుగుణంగా డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. తాజాగా యాసంగి సీజన్లో ఉమ్మడి జిల్లాలో 10.50లక్షల మంది రైతులకు రూ.1,250కోట్లకు పైగా రైతుబంధు ద్వారా చేరాయి. దీన్ని 2018 వానకాలం నుంచి తాజా యాసంగి వరకు పరిశీలిస్తే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో రూ.10,550 కోట్ల రూపాయలు నేరుగా రైతులకే చెందాయి. ఇందులో ఒక్కపైసా కూడా అవినీతి లేదు. ఒక గుంట భూమి ఉన్న రైతు మొదలుకుని ఎంత పెద్ద రైతైనా సరే పద్ధతిగా రైతుబంధు డబ్బులు వాళ్ల ఖాతాల్లోనే జమ అయ్యాయి. ఇదే గత కాంగ్రెస్ పాలనలో అయితే 20 నుంచి 30 శాతం లంచాల రూపంలో కనీసం రెండు వేల కోైట్లెనా పక్కదారి పట్టేవనడంలో సందేహం లేదు.
ఇంకా అనేక ప్రయోజనాలు
రైతుబంధు, రైతుబీమానే కాకుండా ధాన్యం డబ్బుల చెల్లింపులు, సాగు సలహాలు, వాతావరణ అప్డేట్స్ ఇలా ఎన్నో విధాలుగా ధరణి సమాచారం కీలకంగా మారింది. రైతుల దైనందిన జీవితాలతో ధరణి సమాచారం పెనవేసుకుపోయింది. భూ రికార్డుల్లోనూ మధ్యలో ఎవరూ తలదూర్చకుండా పకడ్బందీగా రూపొందించింది. జిల్లా కలెక్టర్లు మినహా ఎవరూ ఇందులో చేర్పులు మార్పులు చేసే అవకాశమే లేదు. 99శాతం కచ్చితమైన సమాచారంతో ఉన్న ధరణి పట్ల రైతులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ధరణి అందుబాటులోకి తేవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ధరణిని రద్దు చేస్తామంటున్న విపక్ష నేతలపై రైతులు మండిపడుతున్నారు. ఫైరవీకారులకు, లంచావతారులకు చెక్ పెడుతూ ప్రతి పైసా నేరుగా రైతులకు చెందడం ఇష్టం లేకనే వాళ్లు అలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ధరణి ఎత్తేసి.. మళ్లీ పాత కష్టాలు తెస్తారా?
ధరణి పోర్టల్తో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. దానిని రద్దు చేస్తే మళ్లీ రిజిస్ట్రేషన్ కష్టాలు తప్పవు. గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లి మూడ్రోజుల పాటు తిరిగి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకునేది. తరువాత డాక్యుమెంటు నమోదుకు తాసీల్దార్ కార్యాలయంలో 40 రోజులు పట్టేది. అందులో వివిధ హోదాల్లో అధికారులకు లంచం ఇస్తే తప్ప పాస్పుస్తకం వచ్చేదికాదు. కానీ.. ధరణి వల్ల నిమిషాల్లోనే భూమి మార్పిడి జరిగి వెంటనే పాస్పుస్తకంలో నమోదు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఇంత మంచి పోర్టల్ను ఎత్తేసి పాత కష్టాలు తీసుకొస్తారా?
– వినోద్కుమార్, జంగారెడ్డిగూడెం, తిప్పర్తి మండలం
గతంలో కాసులు ఇస్తేనే మ్యుటేషన్
గతంలో భూమి మ్యుటేషన్ కావాలంటే నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగాల్సి వచ్చేది. కాసులు ఇస్తేనే మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ పనులు అయ్యేది. సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణి పోర్టల్తో ఇప్పుడు మూడు నిమిషాల్లోనే మ్యుటేషన్ అవుతుంది. పైరవీలు, డబ్బులు ఇవ్వాల్సిన పని లేకుండా పోయింది. ధరణి మాకు చాలా మేలు చేస్తుంది. ఈ విధానంతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సహించలేక కొందరు కావాలనే బురద జల్లుడు పనిలో పడ్డారు. ఇంత మంచి విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడం సరికాదు. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా ధరణి రైతుల పాలిట వరంగా భావిస్తున్నా.
– కొప్పుల రాంరెడ్డి, మిర్యాలగూడ
ధరణితో సులువుగా రిజిస్ట్రేషన్
మా గ్రామం ధర్మాపురంలో ఇటీవల 12గుంటల భూమి కొనుగోలు చేశా. సోమవారం స్లాట్ బుక్ చేసుకొని మంగళవారం ఉదయం 10గంటలకు తాసీల్దార్ కార్యాలయానికి వెళ్లాను. 20 నిమిషాల్లోనే అతి సులువుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ అయ్యింది. గతంలో సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్లాలంటే వారం పట్టేది. దానికితోడు మధ్యవర్తులతో వెళ్లాల్సి ఉండేది. నేరుగా వెళ్లే అవకాశం ఉండేది కాదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత తాసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో ఆన్లైన్ చేసుకున్న మరుసటి రోజే పట్టా తీసుకొనే సదుపాయం కలిగింది. ధరణి వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
– మొగుళ్ల రాములు, ధర్మాపురం, మాడ్గులపల్లి మండలం
గతంలో చెప్పులరిగేలా తిరిగేది
ధరణి వచ్చినంక భూమి రిజిస్ట్రేషన్లు ఖర్చు, పైరవీలు లేకుండానే త్వరగా అవుతున్నాయి. ఒకప్పుడు పహాణీలో తప్పులు వచ్చినా.. భూములు అమ్మకాలు, కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్ కోసం పెద్ద పైరవీలు చేయాల్సి వచ్చేది. చెప్పులరిగేలా తిరుగడంతోపాటు అధికారులకు వేలకు వేలు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. పట్వారీలు (వీఆర్ఓలు) ఆడిందే అట పాడిందే పాటగా ఉండేది. ధరణితో అవన్నీ పోయాయి. మా అమ్మ ఇటీవల కాలం చేసింది. ఆమె పేరున ఉన్న ఎకరం భూమిని వారసత్వంగా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు స్లాట్ బుక్ చేశా. తాసీల్దార్ కార్యాలయానికి వెళ్తే ఎలాంటి హడా వుడి లేకుండా వెంటనే పూర్తి చేశారు. గంటలోనే నా పేరున భూమి మారిపోయింది.
– గుల్రెడ్డి జనార్దన్రెడ్డి, సుబ్బారెడ్డిగూడెం (మిర్యాలగూడ రూరల్)
15 రోజుల పని 15 నిమిషాల్లోనే..
గతంలో భూమి రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరిగి అనేక ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడా పరిస్థితులు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ప్రవేశపెట్టిన ధరణితో తాసీల్దార్ కార్యాలయంలో 15రోజుల్లో అయ్యే పని కేవలం 15 నిమిషాల్లోనే జరుగుతున్నది. ధరణి పోర్టల్ ద్వారా రైతుల కష్టాలు తీరి రిజిస్ట్రేషన్లు సులభతరం అయ్యాయి.
– జటావత్ సురేశ్, జానారెడ్డి కాలనీ, తిరుమలగిరి (సాగర్) మండలం
ధరణి రద్దయితే మళ్లీ దళారుల వ్యవస్థ
ధరణితో ప్రస్తుతం రైతుల డాటా అంతా పక్కాగా పొందుపరుచబడింది. దీని ద్వారా పొలం ఎవరి పేరు మీద ఉంది.. ఎంత ఉంది అనేది సులభంగా తెలుసుకునే వీలవుతుంది. భూ వివాదాలు, ఘర్షణలు తగ్గి అవకతవకలకు వీల్లేకుండా పోయింది. ఎవరి వద్ద నుంచైనా పొలం కొనుగోలు చేసినా, ఫౌతి, గిఫ్ట్ ఇలా ఏదైనా స్లాట్ బుక్ చేసుకున్న కాన్నుంచి రిజిస్ట్రేషన్ వరకు మన మొబైల్కు ప్రతిదీ సమాచారం అందుతుంది. రిజిస్ట్రేషన్ కూడా అరగంటలో పూర్తవుతుంది. ధరణిని రద్దు చేస్తే మళ్లీ దళారుల వ్యవస్థ పెరిగి అవినీతికి తావిచ్చినట్లు అవుతుంది. భూముల రిజిస్ట్రేషన్ల కోసం చెప్పులరిగేలా తిరిగే పరిస్థితులు వస్తాయి. రైతాంగం ఆగమాగం అవుతుంది. ధరణి లేనప్పుడు యజమానికి తెలియకుండానే భూమి మరొకరి పేరు మీదికి మారేది. పాస్బుక్, పట్టా మన దగ్గరే ఉన్నా రికార్డుల్లో తేడాలుండేవి. ధరణితో ఈ సమస్యలన్నీ పోయాయి.
– జొన్నలగడ్డ రేవతి, ఊట్లపల్లి, (మిర్యాలగూడ టౌన్)
ధరణి వచ్చినంక అవినీతి తగ్గింది
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి చాలా బాగుంది. ఎవరికీ లంచాలు ఇవ్వకుండానే ఆన్లైన్ విధానంలో త్వరగా భూముల రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. గతంలో భూమిని అమ్మినా, కొన్నా పట్టాల మార్పిడి కోసం అధికారుల చుట్టూ తిరుగాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్ కోసం నియోజకవర్గ కేంద్రానికి వెళ్లి రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఇప్పడు ఏ ఇబ్బందీ లేదు. మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలోనే భూమి పట్టా చేసుకోవచ్చు. ధరణిలో వేలి ముద్ర వేస్తే పట్టా మార్పిడి జరుగుతుంది. గతంలో ఈ విధానం లేనప్పుడు రైతులకు తెలియకుండానే కొందరు మోసకారులు, అవినీతి అధికారులు ఒకరి బదులు మరొకరికి పట్టాలు చేయించేవారు. ధరణి వచ్చినంకనే అవినీతి తగ్గింది.
– బోయబోయిన భిక్షం, రైతు, మూసీ ఒడ్డుసింగారం, పాలకవీడు మండలం
గతంలో పైసలిస్తేనే పనులు అయితుండె..
గతంలో భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా సమయం పడుతుండె. పైసలు ఇస్తేనే పనులు అయితుండె. భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక రోజంతా పట్టేది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు పోయినంక ఎప్పుడు పిలుస్తరో.. ఎప్పడు సంతకాలు పెట్టమంటరో తెలియక అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా ఎదురు చూసుకుంటూ కూర్చునేటోళ్లం. కాగితాలన్నీ సక్కంగా ఉన్నా పైసలు ఇయ్యకుంటే పని అయ్యేది కాదు. ఎలాగోలా రిజిస్ట్రేషన్ చేయించుకుని తాసీల్దార్ ఆఫీస్కు పోతే మ్యుటేషన్ కోసం నెలల తరబడి తిరుగాల్సి వచ్చేది. అక్కడా అంతోఇంతో ముట్టజెప్పాల్సి వచ్చేది. మొత్తానికి పట్టా చేయించుకోవాలంటే నరకం చూడాల్సి వచ్చేది. ధరణి వచ్చినంక ఈ కష్టాలన్నీ పోయినయ్. ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకుంటే తాసీల్దార్ కార్యాలయంలో పది నిమిషాల్లోనే పూర్తి చేసి పేపర్లు చేతిలో పెడుతుండ్రు. ఇంత సులువుగా అయితదనుకోలె. ఇంత తొందరగా పని పూర్తయ్యే ధరణి బాగా లేదనడం తెలివి తక్కువతనం. దీనిపై నోటికొచ్చినట్లు మాట్లాడడం మూర్ఖత్వమే.
– మామిడి సైదులు, కోనాయిగూడెం, గరిడేపల్లి మండలం