Yadagirigutta | శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. పరమ పవిత్రమైన ఈ మాసం ఆదివారం (ఈ నెల 17) ప్రారంభమవుతుంది. సంక్రాంతికి నెల రోజుల ముందు సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ఆరంభమవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్ని పల్లెల్లో సంక్రాంతి నెల అంటారు. ఈ నెలలో అంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. తిరుప్పావై ప్రవచనాలతో ఆలయాలు మార్మోగనున్నాయి. చివరి రోజు జనవరి 14న గోదా రంగనాథస్వామి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించనున్నారు. నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం.
సాక్షాత్తు భూదేవి అవతారమూర్తి అయిన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. తిరుప్పావై అంటే శ్రీవ్రతం. ఈ వ్రతాన్ని తిరునోము అంటారు. తిరు అంటే మంగళకరం, పావై అంటే మేల్కోలుపు అని అర్థం. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం అర్పించాలి. యువతులు తమ ఇండ్ల ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం. ఈ నెలలో రోజూ సూర్యోదయానికి ఐదు గడియలు ముందుగా నిద్రలేచి తలస్నానం చేసి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. మరో వైపు 30వ రోజు ఆధ్యాత్మికత చెందుతూ పాశురాలను ధ్యానం చేస్తే భగవత్ సంకల్పం ప్రాప్తిస్తుంది.
పన్నెండు మాసాలలో మార్గశిర మాసం చాలా గొప్పది. సూర్యుడి గమనాన్ని బట్టి చెప్పే సౌరమానం ప్రకారం మేషం నుంచి మీనం దాకా సూర్యుడు నెలకో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశమును సంక్రమణం అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో రోజూ తెల్లవారుజామున లేచి స్నానాలు చేసుకుని ఆండాళ్ అమ్మవారి చిత్రపటాన్ని పీట మీద పెట్టి పూలు, పూజా ద్రవ్యాలతో అలంకరించాలి.
గోదా అష్టోత్తర శత నామాలతో అర్చన చేసి మొదటి రోజు టెంకాయ కొట్టి తీపి వంట నైవేధ్యం ఉంచి హారతి ఇవ్వాలి. సాయంత్రం దీపారాధన చేసి వీలుంటే గోదా అష్టోత్తరం చదువాలి. ఇలా బోగి పండుగ వరకు 30 రోజులు వ్రతం చేయాలి. ఈ వ్రతం ఆచరించే వారు ఆండాళ్ అమ్మవారి ముప్పై పాశురములు (తిరుప్పావై) చదువాలి. బోగి రోజు తీపి వంట చక్కెర పొంగలిని ప్రసాదంగా సమర్పించాలి. వ్రతం ఆచరించే వారు ఒంటి పూట భోజనంతోపాటు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి.