రామగిరి, జనవరి 12 : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో శుక్రవారం కూడారై ఉత్సవం వైభవంగా నిర్వహించారు. రామగిరిలోని రెండో భద్రాద్రిగా పేరుగాంచిన సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆండాళ్ అమ్మవారు, తిరుమన్నార్ రంగనాథస్వామికి ఉదయం ప్రత్యేక అభిషేకాలు చేశారు.
అనంతరం కూడారై ఉత్సవంలో 108 గిన్నెలతో చక్కెర పొంగలిని ప్రసాదంగా స్వామి, అమ్మవార్లకు నివేదించారు. అదేవిధంగా నిరాటోత్సవం చేశారు. కూడారైని పురస్కరించుకుని తెల్లవారుజామున 5గంటల నుంచే భక్తులు ఆలయాలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున, రాత్రి వేళ ప్రముఖ ప్రవచకులు శ్రీమాన్ నల్లాన్చక్రవర్తుల రామకృష్ణమాచార్యులు తిరుప్పావై ప్రవచనాలు చేశారు.
సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, ఆండాళ్ అమ్మవారిని కీర్తిస్తూ గోదాదేవి పాశురాలను వివరించారు. ఆలయ ఈఓ టి.జయరామయ్య, ప్రధానార్చకుడు సముద్రాల యాదగిరాచార్యులు, అర్చకులు శఠగోపాచార్యులు, రఘుచార్యులు, భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా పానగల్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రధానార్చకుడు కందాల శ్రీనివాసాచార్యులు కూడారై ఉత్సవం నిర్వహించారు. వీటీ కాలనీ శ్రీదేవీ భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి ఆలయంలో, పాతబస్తీలోని సంతోషిమాత-ఆంజనేయస్వామి దేవాలయంలో, సిద్దార్థ కాలనీ, ఆనందనగర్లోని వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బొడ్రాయిబజార్ : ధనుర్మాసోత్సవాల్లో భాగం గా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి దేవస్థానాల్లో శుక్రవారం కూడారై పాయస నివేదన కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, నల్లాన్ చక్రవర్తుల మురళీధరాచార్యులు ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరిపించారు.
జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సుమారు 1200 మందికి ప్రత్యేకంగా తయారు చేసిన ఈ పాయస ప్రసాదాన్ని అందజేస్తున్నామని ఆలయ అర్చకుడు వేణుగోపాలాచార్యులు తెలిపారు. పాలు, నెయ్యితో ప్రత్యేకంగా తయారు చేసే ఈ ప్రసాదం శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమని వివరించారు. కార్యక్రమంలో ఆలయాల సహాయ అర్చకులు, ఆండాళ్, వికాస తరంగిని భక్తబృందం సభ్యులు పాల్గొన్నారు.