వైభవంగా నిత్య తిరుకల్యాణోత్సవం
శ్రీవారి ఖజానాకు రూ.28,93,323
యాదాద్రి, జూన్ 4 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. స్వయంభూ నారసింహుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూకాంప్లెక్స్, క్యూ లైన్లు, మాఢవీధులు, ప్రసాద విక్రయశాల వద్ద భక్తుల సందడి నెలకొంది. స్వయంభువులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. తిరువారాధన, బాలభోగం, స్వామికి నిజాభిషేకం చేశారు.
స్వామి, అమ్మవార్లకు తులసీ సహస్రనామార్చనలు, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, స్వామికి, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, వెండి మొక్కు జోడు సేవలను అర్చకులు ఘనంగా జరిపించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి చేసిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటకంగా కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ. 28,93,323 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు.