స్వామి నిత్యారాధనలో పాల్గొని తరించిన భక్తులు
శ్రీవారి ఖజానాకు రూ.33,81,486
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భారీగా తరలివచ్చారు. కొండపైన క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి భక్తులతో సందడిగా మారాయి.
యాదాద్రి, మే 22 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి వారి క్షేత్రం ఒకవైపు ఆర్జిత పూజల్లో.. మరోవైపు స్వయంభూ దర్శనాల్లో పాల్గొన్న భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారి నిత్యారాధనల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున నిజాభిషేకంతో పాటు రాత్రి వెండి మొక్కు జోడు సేవల్లో భక్తులు పాల్గొని తరించారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కొండపై క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయాశాల వద్ద, కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణిలో భక్తుల సందడి నెలకొంది.
స్వామి వారికి తలనీలాలు సమర్పించిన భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కొండ కింద పాత గోశాల వద్ద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామికి నిత్యపూజలు తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి మొదలయ్యాయి. స్వామిని సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చక బృందం తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి, స్వయంభువులకు అభిషేకం చేశారు. అనంతరం స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. అనంతరం భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ చేపట్టారు. రాత్రి 7గంటల నుంచి అరగంట పాటు స్వామివారికి తిరువారాధన నిర్వహించిన అనంతరం స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో నిత్యోత్సవాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలు కలుపుకుని స్వామి ఖజానాకు రూ. 33,81,486 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
వందేండ్ల ఉత్సవం.. ఐదు తరాల సంబురం
చివ్వెంల, మే 22 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం పులి తండా ఆవాసం బడి తండాకు చెందిన ధరావత్ ద్వాలీ 100వ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ద్వాలీతో కేక్ కట్ చేయించిన అనంతరం బంజారా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ వేడుకల్లో ఐదు తరాలకు చెందిన 150 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ధరావత్ ద్వాలీ హనుమంత్నాయక్ దంపతులకు నలుగురు కొడుకులు, ఏడుగురు కూతుళ్లు. ద్వాలీ దంపతుల కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనమళ్లు, మనమరాళ్లు, ముని మనుమళ్లు ఇలా ఐదు తరాలకు చెందిన 150 మంది తరలిరావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది.
25న యాదాద్రిలో హనుమాన్ జయంతి
యాదాద్రి ప్రధానాలయంతో పాటు అనుబంధ పాతగుట్ట గుండం వద్ద గల ఆంజనేయ స్వామి వారి వద్ద ఈ నెల 25న హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఓ ఎన్.గీత తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు అష్టోత్తర శతమన్యసూక్త పారాయణాలచే అభిషేకం, లక్ష తమలపాకులచే అర్చన, మహానివేదన వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.