యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 19 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో ఆదివారం భక్తజన సందడి నెలకొంది. సెలవుదినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ జరిపించారు. సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరు కల్యాణ తంతు జరిపించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులు సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రివేళలో స్వామివారికి తిరువారాధన చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. పాతగుట్టలో స్వామి వారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 25వేల మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలతో స్వామి ఖజానాకు రూ.33,09,574 ఆదాయం వచ్చిందని ఈఓ ఎన్.గీత తెలిపారు.
లక్ష బిల్వార్చన.. రథోత్సవం
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట ప్రధానాలయ అనుబంధ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఐదోరోజు బ్రాహ్మణులతో నిత్య హవనం, శివ పంచాక్షరీ జపాలు, నందీశ్వర పారాయణాలు, పంచసూక్త పఠనం నిర్వహించారు. మూల మంత్ర జపం వివిధ పారాయణాలను పారాయణికులు గావించారు. అనంతరం ఉదయం 11నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు యజ్ఞబ్రహ్మ ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నిత్య స్మార్తాగమ ఆరాధనల అనంతరం స్వామి, అమ్మవార్ల రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈఓ ఎన్.గీత, డీఈఓ దోర్బల భాస్కర్శర్మ, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, శివాలయ ప్రధానార్చకుడు నర్సింహరాములశర్మ, ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణశర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.