చండూరు, జనవరి 1: చండూరు మున్సిపాలిటీకి మహర్దశ పట్టనుంది. ఉప ఎన్నిక సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కొటిగా అమలవుతుండడంతో పట్టణ రూపు రేఖలు మారనున్నాయి. ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం టీయూఎఫ్ఐడీసీ( తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్) నుంచి రూ.10 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో రూ.2.50 కోట్లతో మున్సిపల్ భవనం, రూ.50 లక్షలతో కమర్షిల్ కాంప్లెక్స్ నిర్మాణం రూ.5 కోట్లతో సీసీ రోడ్లు, మరో రూ. 2 కోట్లు డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు.
శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం
సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించడంతో అన్ని వీధుల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మిషన్ భగీరథపైపులైన్ ఏర్పాటైన వీధులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
మరో రూ.30 కోట్ల నిధులు
ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై గత నెలలో మునుగోడులో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ చండూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.30 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా మంత్రి జగదీశ్రెడ్డి కూడా చండూరు మున్సిపాలిటీపైన ప్రత్యేక దృష్టిసారించి తన వంతు సాకారంగా 1.60 కోట్లు నిధులు కేటాయించారు.
పార్టీలకు అతీతంగా అన్ని వార్డులు అభివృద్ధి
మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సహకారంతో చండూరును అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం.మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. పార్టీలకు అతీతంగా అన్ని వార్డులు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం.
-తోకల చంద్రకళావెంకన్న, చైర్పర్సన్ చండూరు
సీసీ రోడ్డు ఏర్పాటు ఆనందంగా ఉంది
మా వీధిలో సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. సీసీ రోడ్డు లేకపోవడంతో గతంలో వర్షం వస్తే ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలన్నింటిని వార్డులు నెరవేరుస్తుందనడంలో సందేహం లేదు.
-చొప్పరి యాదయ్య, 3వ వార్డు, లక్కినేనిగూడెం