కట్టంగూర్, ఆగస్టు 23 : గత బీఅర్ఎస్ ప్రభుత్వంలో నకిరేకల్ నియోజకవర్గానికి మంజూరైన సుమారు రూ.150 కోట్ల నిధులను రాజకీయాలకు అతీతంగా ఖర్చు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం కట్టంగూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎక్కడైతే మంజూరైన నిధులు మార్చకుండా అక్కడే ఖర్చు చేసి పనులను పూర్తి చేయాలన్నారు. కేసీఆర్ గ్రామ పంచాయతీలకు అందజేసిన ట్రాక్టర్లు వినియోగంలో లేకుండా పోవడంతో గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీలో అమృత పథకం కింద రూ.5 కోట్లు మంజూరు చేయించానని, ఆ పనులు ఇప్పటికి మొదలు కాలేదన్నారు.
గతంలో వర్షాలు వచ్చినప్పుడు కేసీఆర్ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ శ్రేణులను భాగస్వాములను చేసి సహాయక చర్యలు చేపట్టేవారన్నారు. గత వారం రోజుల నుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సహాయ చర్యలు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం కాదు కూళేశ్వరం అంటూ సీఎం కుంటి సాకులు చెబుతూ చంద్రబాబు కనుసన్నల్లో రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు. నియోజకవర్గంలో రోడ్లు గుంతలు పడి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి పట్టింపులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇవ్వడంతో వారి మీద నమ్మకం పెట్టుకుని ప్రజలు ఓట్లు వేశారని, ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో చేసిన అభివృద్ధి చెప్పాలని ప్రశ్నించారు. కట్టంగూర్ పెద్దవాగుపై రెండు వంతెనల నిర్మాణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో రూ.4 కోట్లు మంజూరు చేయించానని, ఇంత వరకు పనులు మొదలు కాలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించి గతంలో చేసిన పనులకు పెండింగ్ బిల్లులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో జరబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తులనే గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ్మ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చౌగోని జనార్దన్, నాయకులు బెల్లి సుధాకర్, గుండగోని రాములు, దాసరి సంజయ్ కుమార్, నోముల వెంకటేశ్వర్లు, నలమాద సైదులు, మేడి రాములు. మునుగోటి ఉత్తరయ్య, జిల్లా యాదయ్య, పోగుల నర్సింహ్మ, పోగుల అంజయ్య, మాతంగి సైదులు, రాచకొండ యాదయ్య, యర్కల మల్లేశ్, అంతటి అంజయ్య పాల్గొన్నారు.