యాదగిరిగుట్ట, మార్చి 30: అనుభవంలేని గుట్ట దేవస్థాన ఉద్యోగులను బదిలీచేసి, గతంలో ఇక్కడ పనిచేసిన ఉద్యోగులను తిరిగి యాదగిరిగుట్టకు రప్పించాలని దేవస్థాన ఈవో భవానీ శంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఈ నెల 7న రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. 2025 సంవత్సరం చట్టం 11లోని నిబంధనల ప్రకారం త్వరలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం స్వయం ప్రతిపత్తిగల సంస్థగా మారనున్నదని పేర్కొన్నారు. దేవస్థానం స్వతంత్రంగా, సమర్ధవంతంగా పనిచేయడానికి అనుభవజ్ఞులైన సిబ్బంది అవసరమన్నారు.
2024లో దేవాదాయశాఖ కమిషనర్ జారీ చేసిన సాధారణ బదిలీ ఉత్తర్వుల ప్రకారం యాదగిరిగుట్ట దేవస్థానంలో పనిచేసిన డీఈఈ మహిపాల్రెడ్డి, ఏఈవో గట్టు శ్రవణ్కుమార్, సూపరింటెండెంట్లు అశోక్, విజయకుమార్, వెంకటప్రసాద్, సీనియర్ అసిస్టెంట్లు శ్రీకాంత్, శంకర్,స్వామి, లక్ష్మీనర్సయ్య, నర్సింహా, జూనియర్ అసిస్టెంట్లు నరేందర్, పరమేశ్,హర్మేందర్ సింగ్, సింహాచారి,లక్ష్మీనర్సయ్య వేములవాడ దేవస్థానానికి, బాలాజీ, ఎం.ఆగారెడ్డి భద్రాచలం దేవస్థానానికి, నర్సింహులు కొమురవెల్లికి, నరేశ్ బాసర దేవస్థానానికి 2024 ఆగస్టు 6న బదిలీపై వెళ్లారన్నారు.
కాగా వీరిలో మరో సూపరింటెండెంట్ రాజన్బాబు మాత్రం బదిలీపై వచ్చిన వేములవాడ సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్థానంలో తిరిగి యాదగిరిగుట్టలోనే విధులు నిర్వర్తిస్తూ జీత భత్యాలు మాత్రం వేములవాడ దేవస్థానంలోనే స్వీకరిస్తున్నారన్నారు. గుట్ట మరో సూపరింటెండెంట్ దొమ్మాట సురేందర్ కొమురవెల్లికి బదిలీ కాగా గతేడాది సెప్టెంబర్ 12న డిప్యూటేషన్పై తిరిగి యాదగిరిగుట్ట దేవస్థానానికి వచ్చారన్నారు. వీరి స్థానంలో కొందరు ఉద్యోగులు వేములవాడ, భాసర, భద్రాచలం దేవస్థానాల నుంచి బదిలీపై యాదగిరిగుట్టకు వచ్చారని వివరించారు.
యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి బదిలీపై వెళ్లిన ఉద్యోగులు దేవస్థాన పరిపాలన, అభివృద్ధి కార్యకలాపాల విషయంలో గణనీయమైన అనుభవం ఉందన్నారు. వివిధ మౌలిక సదుపాయాలు, యాదగిరిగుట్ట దేవస్థాన ఆలయ పునర్నిర్మాణంలో చురుకుగా పాలుపంచుకున్నారని, అనుభవజ్ఞులైన సిబ్బందిని తిరిగి గుట్టకు రప్పిస్తే అభివృద్ధి పనులను సమర్థవంతంగా చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. గుట్ట స్వయం ప్రతిపత్తి హోదా పొందిన అనంతరం కొత్త నిర్మాణాలు, ఆలయ సౌకర్యాలు, విస్తరణ, కొత్తగా వేదపాఠశాల నిర్మాణం, యాత్రికుల సౌకర్యాల పెంపు, దేవస్థాన పరిధిలోని వివిధ సంస్థల స్థాపన వంటి అనేక నూతన కార్యక్రమాలు, విస్తరణ కార్యకలాపాలు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. 2025 సంవత్సరపు చట్టం-11 ప్రకారం స్వయంప్రతిపత్తి హోదాతోపాటు పరిపాలన అభివృద్ధి అవసరాల దృష్ట్యా అనుబంధం-1 ప్రకారం 2024లో యాదగిరిగుట్ట దేవస్థాన నుంచి బదిలీపై వెళ్లిన ఉద్యోగస్తులను తిరిగి పంపడంతోపాటు అనుబంధం-11 ప్రకారం ఇతర ఆలయాల నుంచి గుట్టకు బదిలీపై వచ్చిన ఉద్యోగులను తిరిగి వారి స్థానాల్లోకి పంపించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.