నకిరేకల్, ఏప్రిల్ 15 : మండలంలోని తాటికల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో చీమలగడ్డ, గోరెంకలపల్లి, మంగళపల్లి, తాటికల్, నెల్లిబండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వాటిల్లో కొనుగోళ్లు ప్రారంభమై వారం రోజులు అవుతున్నది. అయితే.. మధ్యరాత్రి ధాన్యం కాంటా వేస్తున్నారని, తూకాల్లో తేడాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బస్తాకు 41 కిలోలు తూకం వేయాల్సి ఉండగా.. 42 కిలోలు వేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఇదేమిటని రైతులు ప్రశ్నిస్తే సెంటర్ నిర్వాహకులు చెప్తేనే 42 కిలోలు జోకుతున్నామని హమాలీలు చెప్తున్నారు.
చీమలగడ్డ పీఏసీఎస్ సెంటర్లో 13వ తేదీ వరకు 301 మంది రైతుల నుంచి 69,120 బస్తాల (27,648 క్వింటాలు) ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించారు. బస్తాకు కిలో చొప్పున తరుగు తీస్తే రూ.22 నష్టం వస్తుంది. సెంటర్లోని మొత్తం సేకరించిన 69,120 బస్తాలకు రూ.22 చొప్పున రూ.15,20,640 రైతులకు నష్టం వాటిల్లిందన్నమాట. తరుగు తీస్తున్న విషయాన్ని ఎవరికైనా చెప్తే కాంటా ఆలస్యం చేస్తామని, లోడింగ్ చేయబోమని సిబ్బంది హెచ్చరిస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.
తరుగు విషయంలో సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించినా ఫలితం లేకుండాపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ తూకం వేసిన ధాన్యం డబ్బులు సెంటర్ ఇన్చార్జి ఖాతాలోకి వెళ్లాయా.. రైస్ మిల్లర్ల ఖాతాల్లోకి పోయాయా.. పీఏసీఎస్ అధికారుల ఖాతాల్లోకి వెళ్లాయా? అని తేలాల్సి ఉంది. కలెక్టర్ వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
నేను చీమలగడ్డ పీఏసీఎస్ సెంటర్కు 31 క్వింటాల (78 బస్తాలు) ధాన్యం 20 రోజుల కింద తీసుకొచ్చాను. బస్తాకు 42 కిలోలు జోకుతున్నరు. 78 బస్తాలకు 1,716 రూపాయలు నష్టపోయిన. కరువులో అంతంతమాత్రంగానే పండిన వడ్లకు ఎక్కువ తరుగు తీస్తే మేం యాడికి పోవాలె.
– కొడదల నాగయ్య, రైతు, తోకబాయిగూడెం
చీమలగడ్డ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో బస్తాకు 41 కిలోలు మాత్రమే తూకం వేస్తున్నాం. అప్పడప్పుడు తాలు ఉంటే 50 గ్రాములు తరుగు తీస్తున్నాం. కిలో ఎక్కువ తరుగు తీస్తున్నామన్నది అబద్ధం. వేసవి దృష్ట్యా తెల్లవారుజామున 3 గంటల నుంచి కాంటాలు వేస్తున్నాం.
– శీలం నాగరాజు, చీమలగడ్డ సెంటర్ ఇన్చార్జి