రామన్నపేట, ఏప్రిల్ 2: వందశాతం కాన్పులు ప్రభుత్వ దవాఖానల్లోనే చేసే విధంగా వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆయన తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఫార్మసీని పరిశీలించి, అన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్,ఓపీ, ల్యాబ్లను పరిశీలించారు. దవాఖాన బిల్డింగ్ను, డ్రైనేజీని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని టీఎస్ ఐఎండీసీ డీఈని ఆదేశించారు. దవాఖాన పరిధిలోని పీహెచ్సీ వైద్యులు, ఏఎన్ఎంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
గత సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో జరిగిన కాన్పుల వివరాలను పీహెచ్సీల వారీగా సమీక్షించారు. యాభై శాతం కన్నా ఎక్కువ కాన్పులు ప్రైవేటు దవాఖానల్లోనే జరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీహెచ్, డీఎంహెచ్ఓలు ప్రతినెలా మొదటి వారంలో కాన్పులపై సమీక్ష సమావేశం నిర్వహించి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
దవాఖాన ప్రాగణంలో చెట్లు నాటి సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ గరిక సత్యనారయణకు సూచించారు. ఆయన వెంట డీసీ హెచ్ఎస్ చిన్నా నాయక్, డీఎంహెచ్వో మనోహార్, తహసీల్దార్ లాల్బహదూర్, ఎంపీడీవో రాములు, దవాఖాన సూపరింటెండెంట్ శ్వేత ప్రియాంక, వైద్యులు, నర్సింగ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.