నీలగిరి, జనవరి 1: కొత్త ఏడాది జిల్లాకు ఆనందాన్ని పంచింది. డిసెంబర్ 31 రాత్రి వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీసులు రచించిన వ్యూహం ఫలించింది. నూతన సంవత్సర స్వాగత వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగాయి. ఒక్క ప్రమాదం కూడా జరుగకుండా జీరో యాక్సిడెంట్ నైట్గా నమోదై అందరికి సంతోషాన్ని మిగిల్చింది. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి అంతా విధుల్లోనే ఉన్నారు. జిల్లాలో పలు జాతీయ రహదారులతో పాటు పట్టణాల్లో నిరంతరం ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడపడం, ర్యాష్గా డ్రైవింగ్, మితిమీరిన వేగం, పరిమితికి మించి వాహనంపై ప్రయాణాలు వంటి వాటిపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా పట్టణంలో వన్వే నిర్వహించి బందోబస్తు చేపట్టారు. పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు, దేవరకొండ రోడ్డు, ప్రకాశంబజార్లో వాహనాలను వన్ వేలోనే నడిపేలా చర్యలు తీసుకున్నారు. ప్రధాన రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు వాహన చోదకుల వేగానికి కళ్లెం వేశారు. పోలీసులు, ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకున్న చర్యల ఫలితంగా డిసెంబర్ 31 ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో 65 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు.