అసలే శీతాకాలం.. ఆపై తుఫాను ప్రభావం. రోజంతా అత్యంత చల్లని వాతావరణం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి. పగటి సమయాల్లోనూ చలి తీవ్రత ఉంటున్నది. దాంతో జనం తప్పనిసరి అయితే తప్ప బయటకు రావడం లేదు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే
అవకాశం ఉందని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. దగ్గు, జలుబు, ఆస్తమా, న్యుమోనియా,
చర్మ సంబంధ వ్యాధులు ఇబ్బంది పెడుతాయని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా
ఉండాలని చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో 16 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేటలో 18, నల్లగొండలో 17.2 డిగ్రీల చొప్పున రికార్డు అయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు యాదాద్రిలో 19.2, సూర్యాపేటలో 19.7, నల్లగొండలో 18.9 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతల కంటే పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మంచు దట్టంగా కురుస్తున్నది. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుడంటం, చలిగాలులు వీస్తుండటంతో జనం ఇండ్లకే పరిమితమవుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
వాతావరణంలో వచ్చిన మార్పులతో గాలి, నీళ్లు, క్రిమికీటకాల ద్వారా రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి. చలికాలంతోపాటు సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. కాలుష్యం, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల గాలి ద్వారా, వర్షపు నీటి ద్వారా వచ్చే దోమల కారణంగా క్రిమికిటకాల నుంచి రోగాలు వ్యాపిస్తాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. పగలు అధికంగా, రాత్రి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వ్యాధులు సోకుతున్నాయి.
దగ్గు, జలుబు, ఆస్తమా, చర్మ సంబంధ వ్యాధులు, న్యూమోనియా లాంటి జబ్బులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ కాలంలో ఇన్ఫ్ల్యూయెంజా, ఫ్లూ వైరస్లు దాడి చేసే ప్రమాదముంది. ఈ వైరస్లతో జబ్బులు చుట్టుముడుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో తేమ శాతం తగ్గిపోవడంతో చర్మం రక్షణ శక్తి సన్నగిల్లుతుంది. వాతావరణ కాలుష్యం, బహిరంగ ధూమపానం వల్ల గొంతు సంబంధిత వ్యాధులు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
ఉపరితల ఆవర్తనం కారణంగా వారం రోజులుగా నిలకడగా ఉన్న గరిష్ట ఉష్ణోగ్రతలతోపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం రెండ్రోజులుగా తగ్గుముఖం పట్టాయి. గురువారం తెల్లవారుజాము నుంచి తీవ్రత పెరిగింది. ఉదయం 10 గంటలైనా దట్టంగా ఏర్పడిన పొగ మంచు విడిపోవడం లేదు. పొద్దంతా చల్లటిగాలులు వీయడంతో వాతావరణంలో తేమ ప్రభావంతో ప్రజలు వణికిపోతున్నారు. సంక్రాంతి నాటింకి చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.
సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆస్తమా ఉన్న వారు నిత్యం వాడే మందులను అందుబాటులో ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి పనులకు దూరంగా ఉండాలి. చల్లని గాలికి ఎక్కువగా తిరగొద్దు. ప్రయాణం చేస్తున్నప్పుడు నోరు, ముక్కు కవర్ అయ్యేలా మాస్కులు, స్వెటర్లు ధరించాలి. బైక్పై వెళ్లేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. హార్ట్ పేషెంట్లు, గుండె ఆపరేషన్ చేయించుకున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చలిలో ఎక్కువగా తిరగడం వల్ల రక్తనాళాలు సంకోచించి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జ్వరం, దగ్గు, జలుబు వస్తే ఇంట్లోనే ఉండాలి. బయట ఎక్కువగా తిరగవద్దు. ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. నూలు వస్ర్తాలు ధరించాలి. చిన్నపిల్లల చేతులు, కాళ్లకు గ్లౌజ్లు వేయాలి. కాళ్లు, చేతులు పగుళ్లు రాకుండా వ్యాజిలిన్ రాసుకోవాలి. ఉదయం 8 గంటల కంటే ముందు, సాయంత్రం 6 గంటల తర్వాత దూర ప్రయాణాలను రద్దు చేసుకుంటే మంచిది. బీపీ, షుగర్ ఉన్న వారు సైతం జాగ్రత్తలు పాటించాలి.
చలికాలంలో ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా రోగులు చలిగాలిలో, మంచు పట్టిన సమయంలో ఆరుబయట తిరగడం మంచిది కాదు. ముఖ్యంగా చలికాలంలో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడొద్దు. జలుబు, జ్వరం, ప్లూ వంటి వ్యాధులు సోకితే సొంత వైద్యం చేసుకోకుండా వైద్యుల సలహాలు పాటించాలి. వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.
-ఎండీ జాన్ మహ్మద్, వైద్యుడు, హుజూర్నగర్