కల్యాణోత్సవంలో పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు
యాదాద్రి, మే7 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం నిత్య పూజల సందడి కొనసాగింది. స్వయంభూ పంచనారసింహుడికి నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. తిరువారాధన, బాలభోగం, స్వామివారికి నిజాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు తులసీ సహస్రనామార్చనలు, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు చేపట్టారు.
అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం 8గంటలకు స్వయంభూ ప్రధానాలయంలోని ప్రాకార మండపంలో సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, స్వామి, ఆంజనేయ స్వామికి, సహస్రనామార్చన, వెండి మొక్కు జోడు సేవలను ఘనంగా నిర్వహించారు. కొండ కింద పాత గోశాల వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్టలో స్వామి నిత్యపూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వయంభువులను దర్శించుకున్నారు. శ్రీవారి ఖజానాకు రూ.19,46,482 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.