ఆర్కే అక్కసుపై దళితుల ఆగ్రహం
దశాబ్దాలుగా వివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా రూ.10 లక్షలు అందించి పలు యూనిట్ల ద్వారా ఆర్థిక పురోభివృద్ధి సాధించే విధంగా ప్రణాళిక రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలు దళిత కుటుంబాలు యూనిట్లు ఏర్పాటు చేసుకొని లబ్ధిపొందుతున్నాయి. తమతోపాటు మరికొద్ది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాయి. ఇంతటి మహోన్నత పథకంపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు వెల్లగక్కారు. ఏబీఎన్ ఛానెల్లో ఎమ్మెల్సీ కవితతో జరిగిన ఇంటర్వ్యూలో దళితోద్ధరణను ఓర్వలేక అడ్డగోలు వ్యాఖ్యానాలు చేశారు. రాష్ట్రంలో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం ఫ్రీగా ఎలా ఇస్తారని, ఇది వృథా అని అవహేళనగా మాట్లాడారు. కేంద్రం, బీజేపీకి వత్తాసు పలుకుతూ దళిత బంధును బాహాటంగా వ్యతిరేకించారు. దీంతో ఆర్కే చిల్లర కామెంట్స్పై జిల్లా అంతటా దళిత సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడుతున్నది. వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఎస్సీ అట్రాసిటీ కేసు పెడుతామని హెచ్చరిస్తున్నది. తెలంగాణ ప్రజల గొంతుక అయిన నమస్తే తెలంగాణ పత్రికనూ అవహేళన చేస్తూ తన కుసంస్కారాన్ని ప్రదర్శించారు. ఓ పత్రిక అధిపతిగా ఉండి మరో పత్రికపై వ్యాఖ్యలు చేసి మూర్ఖత్వాన్ని చూపారు.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న దళిత బంధు పథకంపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు వెళ్లగక్కారు. దళితుల అభివృద్ధిని ఓర్వలేక అడ్డగోలు వ్యాఖ్యానాలు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు ఎట్లిస్తరని అవహేళనగా మాట్లాడారు. అదేవిధంగా తెలంగాణ ప్రజల గొంతుక అయిన నమస్తే తెలంగాణ దినపత్రికపై తన మూర్ఖత్వాన్ని ప్రదర్శించారు. ఆర్కే చిల్లర కామెంట్స్పై దళితులు, తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది.
దళిత కుటుంబాల్లో వెలుగులు..
దళితోద్ధరణకు దూరదృష్టితో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం సత్ఫలితాలను ఇస్తున్నది. గతంలో వెనుకబాటుకు గురైన ఎస్సీలు సర్కారు తోడ్పాటుతో ఇప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. అతి తక్కువ కాలంలోనే ప్రపంచమే గర్వించేలా నెలకు లక్షలు సంపాదిస్తూ అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు. మొన్నటి దాకా ఉపాధి లేక బిక్కుబిక్కుమంటూ గడిపిన కుటుంబాల్లో.. ఇప్పుడు దళిత బంధు వెలుగులు విరజిమ్ముతున్నాయి. రాష్ట్రంలో సమర్థంగా అమలవుతున్న దళిత బంధు పథకానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో దళితులు ఉపాధి లేక ఎన్నో తంటాలు పడ్డారు. కనీసం కూలి పని కూడా దొరుకని పరిస్థితి ఉండేది. పొద్దంతా పనిచేసినా రోజుకు రూ.వంద కూడా గిట్టుబాటు అయ్యేది కాదు. కుటుంబం గడువలేని పరిస్థితి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలతో దళితుల్లో మార్పు వచ్చింది. దళితుల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా తెచ్చిన దళిత బంధు పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా తొలి విడుతలో ఇప్పటికే 330మందికి దళిత బంధు పథకం మంజూరైంది. ఒక్కో కుటుంబానికి అందిన రూ.10లక్షల ఆర్థిక సాయంతో ఎంతో లాభం ఒనగూరుతున్నది. రెండో విడుత అమలు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో తొలి విడుతగా నియోజకవర్గానికి వంద చొప్పున 345 కుటుంబాలతోపాటు తిరుమలగిరి మండలంలో ఉన్న 2060 కలిపి మొత్తం 2405 కుటుంబాలకు దళిత బంధు పథకం అందజేశారు. ఇప్పటికే 345 మంది లబ్ధిదారులు యూనిట్లు పొంది వ్యాపారం చేసుకుంటుండగా.. తిరుమలగిరిలోని 2060 కుటుంబాలకు ప్రాసెస్ పూర్తయింది. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా యూనిట్లు ప్రారంభించనున్నారు.
వాసాలమర్రిలో ఎస్సీలందరికీ రూ.10లక్షలు..
తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. దళిత బంధు పథకాన్ని తొలుత ఇక్కడే పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు. ఊరంతా సర్వే చేయించారు. సీఎం కేసీఆర్ గ్రామంలో పర్యటించి దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు 75 మందిని గుర్తించి రూ.10లక్షల చొప్పున అందజేశారు. ఆ డబ్బుతో లబ్ధిదారులు విజయవంతంగా తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. వాసాలమర్రితోపాటు నియోజకవర్గానికి వంద మందికి దళిత బంధును పకడ్బందీగా అమలు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరులో కూడా పైలెట్ ప్రాజెక్ట్ కింద అందరికీ ఇస్తామని ప్రకటించారు. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ పథకం అమలు చివరాంకంలో ఉంది. సీఎం కేసీఆర్ చలువతోనే ఉన్నత స్థితికి చేరుకోగలుతున్నామని దళిత బంధు లబ్ధిదారులలు ధన్యవాదాలు చెబుతున్నారు.
నెలకు రూ.50 వేల సంపాదన
తుర్కపల్లిలోని వాసాలమర్రికి చెందిన గ్యార నర్సింహ దళితబంధు రాకముందు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆయన భార్య ఆండాలు పేరుతో దళితబంధు మంజూరు కావడంతో వారి దశ తిరిగింది. పథకంలో వచ్చిన రూ.10లక్షలకు మరో రూ.1.40 లక్షలు జమచేసి ట్రాక్టర్ డోజర్ కొనుగోలు చేశారు. ట్రాక్టర్తో వ్యవసాయ పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రతి రోజూ 7 నుంచి 8 గంటలు కిరాయికి నడిపిస్తున్నారు. ప్రభుత్వ సంబంధిత పనులు సైతం అధికారులు వారికే అప్పగిస్తున్నారు. డీజిల్ ఖర్చులు పోను నెలకు రూ.50వేల వరకు మిగులుతున్నాయని సంతోషంగా చెబుతున్నారు. ఈ సంవత్సరం రూ.6లక్షలకు పైగా సంపాదించినట్లు తెలిపారు.
దళితబంధుతో తీరిన కష్టాలు..
కొన్నేండ్లుగా ప్రైవేట్ పాఠశాలల్లో, రాత్రి బడుల్లో పని చేశాం. అయినా పూర్తి స్థాయిలో జీతాలు రాలేదు. కుటుంబం గడువక చాలా ఇబ్బందులు పడ్డాం. దళితబంధు పథకం కింద మంజూరైన రూ.10లక్షలతో సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాం. ఖర్చులు పోను నెలకు రూ.20వేల వరకు మిగులుతున్నాయి. ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నాం. దళితుల అభివృద్ధి కోసం దేశంలోనే మొదటిసారిగా దళితబంధు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దే. మా జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఎమ్మెల్యే కిశోర్కుమార్కు రుణపడి ఉంటాం.
– తడకమళ్ల శివశాంతి, తుంగతుర్తి
దళితులకు ఆర్థిక భరోసా
దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకం ప్రవేశపెట్టింది. ఆ పథకం కింద నాకు రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ఆ డబ్బుతో బొలేరో ట్రాలీ తీసుకున్నా. అంతకుముందు కూలి పనులకు, డ్రైవింగ్కు వెళ్లేవాడిని. ఇప్పుడు యజమాని అయ్యాను. కూలి పనుల కోసం ఎదురు చూడకుండా వాహనాన్ని కిరాయిలకు తోలుకుంటూ సంతోషంగా జీవిస్తున్నా. మా గ్రామంలో మొత్తం 67 మందికి దళితబంధు మంజూరైంది. నిన్నటి వరకు కూలీలుగా ఉన్నవారు కొంత మంది వ్యాపారాలు పెట్టుకున్నారు. మరి కొంతమంది వాహనాలు తీసుకొని యజమానులుగా మారి సంతోష జీవితాన్ని గడుపుతున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యదావాలు.
– గొల్లపూడి మరియదాసు, దళితబంధు లబ్ధిదారుడు,
కిష్టాపురం, చింతలపాలెం మండలం
నెలకు రూ.40వేలతో ఆత్మగౌరవంగా బతుకుతున్నం..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం కింద రూ.10లక్షలు మంజూరయ్యాయి. ఆ డబ్బుతో రూ.7.5లక్షలతో టీ గ్లాస్ యూనిట్ మరో రూ.2.5లక్షలతో పేపర్ ప్లేట్ యూనిట్ను ఏర్పాటు చేసుకున్నాం. తయారు చేసిన సరుకులను వారానికోసారి ఆటోలో తీసుకెళ్లి మండలంతోపాటు పరిసర మండలాల్లోని షాపులకు స్లపయ్ చేస్తున్నాం. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.40వేలకు పైగా సంపాదిస్తూ సంతోషంగా జీవనం సాగిస్తున్నాం.
– బొల్లారం రవి, దళితబంధు లబ్ధిదారుడు, వాసాలమర్రి
దళిత బంధు పథకం పట్ల ఏబీఎన్ ఆర్కే అడ్డగోలు వాగుడుపై దళిత సమాజం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నది. ఇప్పటి దాకా దేశంలో, రాష్ట్రంలో ఏ సర్కారు కూడా అమలు చేయని పథకాన్ని అవహేళన చేయడంపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధు కింద రూ.10లక్షలు ఫ్రీగా ఎట్ల ఇస్తరని ఆర్కే వ్యాఖ్యానించడంపై ఫైర్ అవుతున్నారు. ఎస్సీలు అభివృద్ధి చెందడం చూడలేకనే.. ఆర్కే బీజేపీ, కేంద్రం పంచన చేరి దళిత బంధును వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఏ ముఖ్యమంత్రీ చేయలేని గొప్ప కార్యక్రమాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని పేర్కొంటున్నారు. అలాంటి పథకంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని.. తన రాతలు, మాటల ద్వారా దళిత బంధుపై విషం కక్కుతున్నారని మండిపడుతున్నారు. ఆర్కే దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
సంక్షేమ పథకాలపైనా తప్పుడు భాష్యం
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపైనా ఆర్కే తప్పుడు భాష్యం చెప్పారు. తన వక్రబుద్ధితో పథకాలను వక్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాకు తాబేదారుగా ఉచితాలు ఓట్లు తేవని అడ్డంగా వాదించారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేదల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. దళిత బంధుతోపాటు ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, డబుల్ బెడ్ రూం ఇండ్లు, కేసీఆర్ కిట్ వంటి అనేక కార్యక్రమాలు, పథకాలు దిగ్విజయంగా అమలు చేస్తుండటాన్ని చూసి ఓర్వలేక ఉచితాలు అనే సాకుతో తన దుర్భుద్ధి వెల్లగక్కారని నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాష్ట్రం అమలు చేస్తున్న పలు పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమలు చేస్తున్న సంగతి లోకమంతా చూస్తున్న విషయం తెలిసిందే.
గతంలోనూ కుట్రలు.. కుతంత్రాలు
ఏబీఎన్ రాధాకృష్ణ ఎప్పుడూ తెలంగాణపై విషయం కక్కుతూనే ఉన్నారు. గతంలో తెలంగాణపై అడ్డగోలు రాతలు, వార్తలు ప్రసారం చేశారు. దళితులను బాడుగ నేతలుగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం, కేసీఆర్ సీఎం కావడాన్ని ఓర్చుకోలేకపోయారు. నాడు అసెంబ్లీలో తెలంగాణ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని అవహేళనగా, వ్యంగ్యంగా చిత్రీకరించి తెలంగాణ సమాజం నుంచి చివాట్లు తిన్నారు. ఇక నమస్తే తెలంగాణ పత్రికపైనా ఆర్కే దిగజారుడు మాటలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ర్టానికి గుండెకాయలా నమస్తే తెలంగాణ పత్రిక పనిచేసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా బయట శక్తుల నుంచి కాపాడుతూ తన వంతు పాత్ర పోషిస్తున్నది. అలాంటి పత్రికపైనా చిల్లర వ్యాఖ్యలు చేయడంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నమస్తే తెలంగాణను విమర్శించే స్థాయి ఆర్కేకు లేదు..
దళితబంధు పథకంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంటే.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రం తన అక్కసు వెళ్లగక్కుతున్నాడు. నమస్తే తెలంగాణను విమర్శించే స్థాయి ఆర్కేకు లేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నమస్తే తెలంగాణ దినపత్రిక పాత్ర అందరికీ తెలుసు. అప్పుడు ఆంధ్రా పత్రికలు రాసిన వార్తలేంటో కూడా తెలుసు. నమస్తే తెలంగాణ స్థాపించిన రోజే మిగతా పత్రికల యాజమాన్యాల్లో వణుకు పుట్టింది. 8 ఏండ్లకు ముందు తెలంగాణలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి రాధాకృష్ణకు కనపడడం లేదా? నరేంద్ర మోదీ, చంద్రబాబునాయుడికి కొమ్ముకాసే ఆర్కే వంటి వారికి తెలంగాణ గురించి మాట్లాడే కనీస అర్హత లేదు. దళితులు అభివృద్ధి చెందడం ఇష్టం లేకనే రాధాకృష్ణ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నోరు అదుపులో ఉంచుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తది.
– రావిచెట్టు సత్యం, ఎమ్మార్పీఎస్ నాయకుడు, చివ్వెంల
రాధాకృష్ణ వ్యాఖ్యలు అర్థరహితం
దళితబంధు పథకంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలు అర్థరహితం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇటీవల దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దళితుల సంక్షేమానికి ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వమూ నిధులు ఖర్చు చేయలేదు. దేశానికి ఆదర్శంగా ఉన్న దళితబంధు పథకంపై ఆర్కే వ్యాఖ్యలు బాధాకరం. దళితులు అభివృద్ధి చెందుతుంటే నిధులు వృథా అని కామెంట్ చేయడం సరికాదు.
– లక్ష్మాల వెంకటప్పయ్య, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు, అనంతగిరి
దళితబంధును అవమానిస్తే దళితులను అవమానించినట్లే..
నేను గతంలో లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని వదిలి రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉండేవాడిని. దళితబంధు పథకం కింద ట్రాక్టర్ డోజర్ మంజూరు కావడంతో ఇప్పుడు ఇంటి వద్దే నడుపుకొంటూ ఆనందంగా జీవిస్తున్నాం. మా లాంటి నిరుపేదలకు సీఎం కేసీఆర్ చేస్తున్న మేలు జన్మ జన్మలకు మరువం. గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నాయి.. తప్ప ఎలాంటి సహాయమూ చేయలేదు. దళితుల అభివృద్ధిని ఓర్వలేనివారు పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారు. దళిత బంధు పథకాన్ని అవమానిస్తే దళితులను అవమానించినట్లే.
– పరంగి శ్రీను, దళితబంధు లబ్ధిదారుడు, కోమటికుంట, పాలకవీడు మండలం
ఆర్కే.. బీజేపీ తొత్తు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రయోజనాల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే.. వాటిని ఉచితాలంటూ అవహేళన చేయడం దుర్మార్గపు చర్య. ఏబీఎన్ రాధాకృష్ణ కేంద్ర ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ పాలకుల చేతిలో కీలుబొమ్మగా ఏబీఎన్ మారింది. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెడితే అవహేళనగా మాట్లాడడం సరికాదు.
– చింతల నరేశ్, దళిత సంఘం నాయకుడు, భువనగిరి
రాధాకృష్ణవి మూర్ఖపు మాటలు..
దళితబంధు ఎంతో గొప్ప పథకం. నిరుపేదలైన దళితులను ఉన్నతంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన మహోన్నతమైన స్కీమ్. దళితుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేలా చేపట్టిన ఈ పథకంతో ఎంతో మంది పేదలు సగౌరవంగా బతుకుతున్నారు. దళితబంధులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారాలు లేవు. ఒకే కుటుంబానికి రూ.10లక్షలు ఎలా ఇస్తారని మాట్లాడిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ దళితుల ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు.
– బత్తుల రాజేశ్, దళితబంధు లబ్ధిదారుడు, భువనగిరి
ఆర్కే అడ్డగోలు మాటలు వెనక్కి తీసుకోవాలి..
దళితబంధు పథకాన్ని అవహేళన చేస్తూ రాధాకృష్ణ అన్న మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా. దళితబంధు దళితుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పథకం. దళితులకు డబ్బు ఇవ్వడం ఎందుకు.. ఈ పథకంతో ఎవరు అభివృద్ధి చెందుతున్నారని అనడం సరికాదు. రాధాకృష్ణ ఏ దృష్టితో అన్నా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. దళిత కుటుంబాల అభివృద్ధికి తీసుకొచ్చిన పథకాన్ని వ్యతిరేకించవద్దు. దళితుల అభివృద్ధి గురించి గత పాలకులు పట్టించుకోకుంటే ఎవరూ అడగలేదు. దళితుల అభివృద్ధిని అడ్డుకోవడానికే ఉచితాలు అంటూ మాట్లాడుతున్నారు. ఇది సమంజసం కాదు. దళితులకు ఉచితంగా డబ్బులిస్తే రాధాకృష్ణకు నష్టమేంటి. గతంలో దళితులకు ఏ పథకాలూ ఇవ్వకపాయె. ఇచ్చేవారిపై బురద జల్లడం సరికాదు.
– బట్టు రాంచంద్రయ్య, దళిత సంఘాల జిల్లా అధ్యక్షుడు, యాదాద్రి భువనగిరి
దళితులకు రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి..
దళితబంధు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దేశంలోనే ఉత్తమమైన ఈ పథకంతో నిరుపేదలు వివిధ రంగాల్లో వ్యాపారాలు చేసుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు. సంతోషంగా జీవనం గడుపుతున్నారు. అటువంటి పథకంపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అవహేళనగా మాట్లాడడం దళితులను కించపర్చడమే. దళితులకు రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలి.
– ఈదుల కిరణ్, నాగారం