సూర్యాపేట, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : అణగారిన వర్గాల ఐకాన్గా నిలిచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్లో కొత్త సెక్రటేరియట్ ముందు, హుస్సేన్సాగర్ తీరాన ఏర్పాటు చేయడమంటే దళిత జాతి మొత్తానికి సన్మానం చేయడంతోపాటు అన్ని వర్గాలకు సముచిత గౌరవం ఇచ్చినట్లే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ రాష్ర్టాన్ని భారతదేశానికే దిక్సూచిగా చూపిస్తుండగా.. తాజాగా ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతో దేశంలో మరోమారు తెలంగాణ కీర్తికిరీటం ఎగిరింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛావాయువులతో జీవించాలనే లక్ష్యంతో బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రచించారు. ప్రధానంగా వందల సంవత్సరాలపాటు అణిచివేతకు గురై కనీసం మనుషులుగా గుర్తించని దళిత జాతిని మానవ సమాజంలో కలిపి వారికి కూడా హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్దే. అటువంటి మహానుభావుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా దళిత జాతికి పెద్ద సన్మానమేనని దళిత మేధావులు, ప్రముఖలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అంబేద్కర్ను జయంతి, వర్ధంతుల సందర్భంగా స్మరించిన పార్టీలను మాత్రమే చూశామని, తెలంగాణలో మాత్రం ఆయన ఆశయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని పేర్కొంటున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ప్రజలకు అన్ని హక్కులు సంక్రమించాయి. కానీ.. వాటిని ఏ ప్రభుత్వం కూడా సరిగ్గా అమలు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం విద్య, ఉద్యోగాల కల్పనతోపాటు విద్యుత్, నీళ్లు ఇలా సకల సౌకర్యాలు కల్పించడం ద్వారా అన్న వర్గాలకు రాజ్యాంగ హక్కులు అందుతున్నాయి. ఇక అత్యంత ప్రధానమైనది దళిత జాతికి ఎనలేని అండ, గౌరవం కల్పించేది కేసీఆర్ ప్రభుత్వమే. దళితుల అభ్యున్నతి కోసం అనేక పథకాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రధానంగా చదువే శక్తివంతమైన ఆయుధంగా భావించి వందలాది గురుకులాలు, ఎస్సీ స్టడీ సర్కిళ్లు, ఇతర దేశాల్లో విద్యనభ్యసించే వారి కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్తోపాటు పారిశ్రామిక వాడల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళిత బంధు పేరుతో రూ.10 లక్షలను ఉచితంగా ఇచ్చి మక్కువ ఉన్న వ్యాపారాలు చేయిస్తున్నది. దీంతో దేశంలోనే తెలంగాణ దళిత జాతి రానున్న కొద్ది సంవత్సరాల్లోనే ఇతర వర్గాలకు దీటుగా కాలర్ ఎత్తుకొని జీవించగలుగుతారని దళిత మేధావులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళితుల అభ్యున్నతి కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్ తాజాగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతో దళిత జాతికి అత్యున్నత సన్మానం చేసినట్లేనని దళిత మేధావులు, నాయకులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహించడం అవసరమని, దీంతో తెలంగాణ మాదిరి యావత్ దేశం బాగుపడుతుందని పేర్కొంటున్నారు.
అతి పెద్ద ప్రజాస్వామిక దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడం అద్భుతం. ఇది సీఎం కేసీఆర్ దార్శనికతకు అద్దంపడుతూ భావితరాలకు స్ఫూర్తినిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు, నూతన సచివాలయానికి ఆయన పేరు పెట్టడం హర్షణీయం. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో రాబోయే తరం పయనించాలని, రాజ్యాంగంలో కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం సీఎం కేసీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయడం చరిత్రాత్మక నిర్ణయం. హైదరాబాద్కు వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు, బుద్ధిస్టులు, అంబేద్కర్ అనుయాయులు అంబేద్కర్ భారీ విగ్రహాన్ని తప్పకుండా సందర్శించే అవకాశాలు ఉంటాయి. అది టూరిస్టు ప్రాంతంగా నిలిచే అవకాశాలున్నాయి. దళిత సాధికారత, వారి ఆర్ధ్థిక పరిపుష్టి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితబంధు పథకం చరిత్రలో గుర్తుండిపోతుంది. దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకురావడానికి సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా చేస్తున్న కృషికి ధన్యవాదాలు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి రిజర్వేషన్లు ప్రవేశపెడితే బాగుంటుంది.
– తలమళ్ల హసేన్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు (బొడ్రాయిబజార్)
పాలకుల వివక్షపై, నిజాం రజాకార్ల పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు పురుడు పోసుకున్న తెలంగాణలో ఆనాడు ప్రజలకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేదు. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఎన్నో పోరాటాలతో అంబేద్కర్ స్ఫూర్తితో ఏర్పడింది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నాడు రాజ్యాంగంలో అవకాశం కల్పించడంతోనే ఇది సాధ్యమైంది. అందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాలు అంబేద్కర్ గొప్పతనాన్ని కీర్తిస్తుంటే మన దేశ పాలకులు నిర్లక్ష్యంతో ఆయన సేవలను విస్మరించారు. రాజధాని నడిబొడ్డున అంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. బాబాసాహెబ్ను చిన్న చూపు చూసిన సమాజం నేడు ఆయనను చూడాలంటే తలెత్తేలా చేసిన సీఎం కేసీఆర్కు అణగారిన ప్రజలు రుణపడి ఉంటారు.
– భూతం ముత్యాలు, కవి రచయిత, ఉపాధ్యాయుడు, తిరుమలగిరి గ్రామం, నాంపల్లి మండలం
భారతావనికే వన్నె తెచ్చిన మహానుభావుడు బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడం హర్షణీయం. పపంచంలోనే ఎక్కడా లేని ఇంతటి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. ఆయనను అభినవ అంబేద్కర్గా చెప్పవచ్చు. రాజ్యాంగంలో అన్ని మతాలకు సమానత్వం, అణగారిన కులాలకు సముచిత స్థానం కల్పించిన మహనీయుడి భారీ విగ్రహ ఏర్పాటు ఆలోచన రావడం గొప్ప విషయం. దళిత బంధు పథకం ప్రవేశపెట్టి దళితులు ఆత్మగౌరవంగా బతికే విధంగా కృషి చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ జయంతి రోజున భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా దళిత బంధు ప్రవేశపెడుతామని చెప్పిన మొదటి వ్యక్తి సీఎం కేసీఆర్. దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం కేవలం కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. ఆయనతోనే దళితుల తలరాతలు మారుతాయని దళిత సమాజం భావిస్తున్నది.
– కందుకూరి లక్ష్మయ్య మాదిగ, దళిత రత్న అవార్డు గ్రహీత, తిరుమలగిరి
న్యాయవాది, ఆర్థిక, రాజకీయవేత్త, సామాజిక సంస్కర్త, రాజ్యాంగ నిర్మాత అయిన బీఆర్ అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ ఒడ్డున కొత్త సచివాలయం పక్కన దేశంలోనే అత్యంత ఎత్తైన బాబాసాహెబ్ విగ్రహం, భీమ్ పార్కు లైబ్రరీ, మ్యూజియం, జ్ఞాన మందిరం, అంబ్కేదర్ జీవిత ముఖ్య ఘట్టాల ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేయడం హర్షణీయం. రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా దళితుల ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తామనడం, అంబేద్కర్ కలలు నిజం చేసే విధంగా పరిపాలన ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం ఆశావాహమైనదే.
– బెజవాడ శ్రావణ్, మాదిగ అభివృద్ధి సంఘం నాయకుడు (కోదాడ టౌన్)
తెలంగాణ సమాజం గర్వపడేలా బాబాసాహెబ్ స్ఫూర్తి చిహ్నం ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. అంబేద్కర్ ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు.. మహాత్మాగాంధీ, నెహ్రూ అన్ని వర్గాలకు చెందినవారు ఎలా అయ్యారో అంబేద్కర్ కూడా అందరికీ చెందిన వ్యక్తిగా చూడాలి. అంబేద్కర్ విధానాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నడుం బిగిస్తే ఇంకా బాగుంటుంది. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అంబేద్కర్ జయంతిని పండుగలా నిర్వహించిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– కత్తి వెంకటేశ్వర్లు, ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి (గరిడేపల్లి)
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వంటి ఎందరో మహనీయుల ఆశయాలను సాకారం చేస్తున్న అభినవ అంబేద్కరుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మహనీయుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. దళితుల పక్షపాతిగా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ ఘనత యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చేపట్టిన విగ్రహ ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతుంటే.. సీఎం కేసీఆర్ అతి తక్కువ సమయంలోనే పనులను శరవేగంగా పూర్తి చేసి పండుగ వాతావరణంలో ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతో మంది మేధావులు, దళిత సంఘాలను, అధికారులను, ప్రజాప్రతినిధులను సాదరంగా ఆహ్వానించడంతోపాటు అంబేద్కర్ వారసుడు ప్రకాశ్ అంబేద్కర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి గౌరవించడం తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. 2014కు ముందు దళితులను ఓటుబ్యాంక్గా వాడుకోవడమే కాకుండా గొడవలు, కొట్లాటలు, స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారే తప్ప వారి ఎదుగుదలకు సహకరించలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దళితులకు సముచిత స్థానం ఇవ్వడంతోపాటు అన్ని రంగాల్లో రాణించేలా వారిని ప్రోత్సహించారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా దళితబంధు పథకం ప్రవేశపెట్టి ఎన్నో దళిత కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపారు. దళితుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ వారు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు దళిత సమాజమంతా రుణపడి ఉంటుంది.
– బొల్లెద్దు వినయ్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు (సూర్యాపేట టౌన్)
భారతదేశంలో మలి వేదకాలం నుంచి పాతుకుపోయిన మానవ నిర్మిత అడ్డుగోడలైన కుల వ్యవస్థ, అంటరానితనం అనే అనాగరిక శిక్షలు బడుగు, బలహీన వర్గాలను దీనస్థితిలోకి దిగజార్చాయి. ఇలాంటి వివక్ష పూరిత సమాజంలో ఎలాంటి హక్కులు లేకుండా సామాజిక బహిష్కరణకు గురైన జాతిలో పుట్టిన ధుృవతార డాక్టర్ బీఆర్ అంబేద్కర్. బోధించు, సమీకరించు, పోరాడు నినాదాలతో దళిత సమాజాన్ని సంఘటితం చేసిన మహానీయడు అంబేద్కర్. బడుగు, బలహీన వర్గాలతోపాటు అణిచివేయబడిన ఇతర కులాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని సాధించడానికి రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టి వారిని ఉన్నతీకరించారు. నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న దళితుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధితోపాటు దళితబంధు పథకం ప్రవేశపెట్టి వారిని కూలీల నుంచి యజమానులుగా మార్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు.
– గోలి చెన్నకేశవులు, ఆర్టీసీ విశ్రాంత డిప్యూటీ రీజనల్ మేనేజర్, మునుగోడు